4, 5 తేదీల్లో రాహుల్ ప్రచారం
ABN , First Publish Date - 2020-02-02T16:37:11+05:30 IST
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈనెల 4, 5 తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు. రెండు బహిరంగ సభల్లో ఆయన ..
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈనెల 4, 5 తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు. రెండు బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచార ప్రోగ్రాం ఇంకా ఖరారు కాలేదు.
మరోవైపు, ఇందుకు భిన్నంగా ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నువ్వానేనా అనే రీతిలో ఎన్నికల ప్రచారంతో ఊదరగొడుతున్నాయి. కేజ్రీవాల్ ప్రధానంగా రోడ్షోలపై దృష్టి సారిస్తుంటే, బీజేపీ స్టార్ క్యాంపెయినర్లతో లెక్కకు మిక్కిలిగా బహిరంగ సభలు నిర్వహిస్తోంది. ఆప్, బీజేపీలు అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇంటింటి ప్రచారంపై దృష్టి సారిస్తోంది. పార్టీ 15 ఏళ్ల వరుస పాలనలో సాధించిన ప్రగతి, ఆ ప్రగతి ఫలాలు నేడు ప్రజలకు అందుబాటులోకి వచ్చిన వైనం వివిరిస్తూ ఓట్లు అడుగుతోంది. చాపకింద నీరులా ప్రచారం సాగిస్తోంది. ఈ ఆదివారంమే ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు కూడా సిద్ధమవుతోంది.