అవి రైతు దగా కేంద్రాలు!
ABN , First Publish Date - 2022-05-20T08:31:26+05:30 IST
రైతు భరోసా కేంద్రాలు రాష్ట్రంలో రైతు దగా కేంద్రాలుగా మారుతున్నాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు. ఈ విషయం తమ పార్టీ ఎంపీ
మిల్లర్లతో కలిసి రైతుకు ఆర్బీకేల మోసం
మా ఎంపీ పిల్లి సుభాష్ బయటపెట్టారు
సీఎంకు తెలియకుండానే చేస్తున్నారా?
జగన్కు ఓటు వేశామని జనంలో పశ్చాత్తాపం
అందుకే బాబు సభలకు భారీఎత్తున రాక
రఘురామరాజు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, మే 19 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసా కేంద్రాలు రాష్ట్రంలో రైతు దగా కేంద్రాలుగా మారుతున్నాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు. ఈ విషయం తమ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వయంగా బయటపెట్టారని ఆయన గుర్తుచేశారు. ‘‘వరిధాన్యం రైతు భరోసా కేంద్రాలకు చేరకుండా మిల్లర్లు, స్థానిక నేతలు కలిసి అడ్డుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో రైతులకు ఽఇంకా దాన్యం అమ్మిన డబ్బుల బకాయి చెల్లించలేదు. ముఖ్యమంత్రికి తెలియకుండానే ఇదంతా జరుగుతోందా? ఒకవేళ అదే జరిగితే జగన్ సీఎం పదవిలో ఉండడానికి అర్హుడు కాదు’’ అని వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రజారాజకీయం చేయండి. కానీ కుల రాజకీయం చేయడం మంచిది కాదు. కొంతమంది రెడ్డి కాకపోయినా ఆ పేరు పెట్టుకుంటున్నారు. పుచ్చలపల్లి సుందరయ్యలాంటి వారు తమ పేరు చివరన రెడ్డి అనే పదాన్ని తొలగించుకున్నారు. ఏ రోజు కూడా రానంత జనం ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటనకు వస్తున్నారు. వైసీపీకి ఎందుకు ఓటు వేశామని ప్రజలు పశ్చాత్తాపంతో రోడ్లెక్కుతున్నారు.
ఒక్క సీటు కూడా రాని పరిస్థితి మా పార్టీ తెచ్చుకోకూడదు’’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై చినజీయర్ స్వామి చాలా సున్నితంగా విమర్శించారు. జీయర్స్వామిని కూడా ఇప్పుడు దుష్ట చతుష్టయంతో కలుపుతారా?’’ అని ప్రశ్నించారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టినందుకు సీఎం జగన్కు ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారని, తనను వేధించి, హింసించినందుకు వచ్చే ఎన్నికల్లో సునీల్కుమార్కు లోక్సభ టికెట్ ఇచ్చి సత్కరిస్తారేమోనని రఘురామ వ్యాఖ్యానించారు.