నీ పాపం పండెను నేడు... నీ భరతం పడతా చూడు.. రఘురామ సెటైర్లు

ABN , First Publish Date - 2021-04-11T17:45:43+05:30 IST

ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేయనున్నారు.

నీ పాపం పండెను నేడు... నీ భరతం పడతా చూడు.. రఘురామ సెటైర్లు

న్యూఢిల్లీ: ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సీబీఐ కోర్టుకు సోమవారం సెలవు లేదని, ఈసారి తప్పనిసరిగా తన పిటిషన్ న్యాయస్థానం స్వీకరిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ తన పిటిషన్ విచారణకు రాకపోతే.. హైకోర్టుకు వెళతానని తేల్చి చెప్పారు. ఈ మేరకు సీబీఐ కోర్టుకు శనివారం ఓ లేఖ రాసినట్టు తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్.. నిందితుడి తరఫున పని చేస్తున్నారా లేక సీబీఐ తరఫున పని చేస్తున్నారా అన్నది సోమవారం తెలుస్తుందన్నారు. ‘స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం’ అని పాడుకుంటారో.. ‘‘నీ పాపం పండెను నేడు... నీ భరతం పడతా చూడు’’ అని అంటారో సోమవారం నాటికి తేలిపోతుందన్నారు. సీబీఐ కోర్టులో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొందన్నారు.


సీబీఐ కోర్టులో రఘురామరాజు దాఖలు చేసిన పిటిషన్‌‌ సాంకేతిక కారణాలతో విచారణకు రాలేదు. ఈ మేరకు ఆయన గత బుధవారమే వివరణ ఇచ్చారు. పిటిషన్‌లో జగన్‌ బెయిల్‌ రద్దుకు సంబంధించి తాను సమర్పించిన ఆధారాలపై సీబీఐ కోర్టు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిందని రఘురామ వెల్లడించారు. అయితే రఘురామ పిటిషన్ తిరస్కరణకు గురైందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఆయనే స్వయంగా దీనిపై వివరణ ఇచ్చారు.

Updated Date - 2021-04-11T17:45:43+05:30 IST