చంద్రబాబును ఆలింగనం చేసుకున్న రఘురామ

ABN , First Publish Date - 2021-12-17T23:13:29+05:30 IST

తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి మహోద్యమ సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబును ఎంపీ రఘురామకృష్ణరాజు

చంద్రబాబును ఆలింగనం చేసుకున్న రఘురామ

తిరుపతి: తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి మహోద్యమ సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబును ఎంపీ రఘురామకృష్ణరాజు ఆలింగనం చేసుకున్నారు. సభ వేదికపైకి చంద్రబాబు రాగానే రఘురామ ఆత్మీయంగా పలకరించారు. రఘురామకృష్ణారాజు కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు. దూరంగా ఉండడమే కాకుండా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను ఎప్పటికప్పుడు విమర్శిస్తూ.. ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్నారు. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అయితే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి రఘురామ అండగా నిలబడ్డారు. ఈ రోజు తిరుపతిలో నిర్వహిస్తున్న సభకు ఆయన ఢిల్లీ నుంచి వచ్చి హాజరయ్యారు. అమరావతి పరిరక్షణ సమితి మహోద్యమ సభకు చంద్రబాబు, రఘరామకృష్ణరాజు, నటుడు శివాజి, సీపీఐ నారాయణ, సీపీఐ రామకృష్ణ, బీజేపీ కన్నా లక్ష్మీనారాయణ, శ్రీనివాసానంద సరస్వతి స్వామి (గుంటూరు), కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, మాజీమంత్రి పరిటాల సునీత హాజరయ్యారు. 


మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రకటించి నేటితో సరిగ్గా రెండేళ్ళవుతున్న తరుణంలో అమరావతి పరిరక్షణ సమితి ఈ సభ నిర్వహిస్తోంది. అదే సమయంలో అమరావతి పరిరక్షణ పేరిట రెండేళ్ళ నుంచీ ఉద్యమం కొనసాగిస్తున్న రాజధాని రైతులు తాజాగా 44 రోజుల పాటు సాగించిన మహా పాదయాత్రను ఈనెల 14న తిరుపతిలో ముగించిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా తమ ఉద్యమ, పాదయాత్రల ఉద్దేశాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే సంకల్పంతో రాజధాని రైతులు ఈ సభ నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు, ప్రవాసాంధ్రులు ఈ సభ పట్ల, తదనంతర పరిణామాల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఈ బహిరంగసభకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది.


Updated Date - 2021-12-17T23:13:29+05:30 IST