ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే అన్న క్యాంటీన్‌లు ఎందుకు మూసేశారు?: రఘురామ

ABN , First Publish Date - 2022-01-28T20:39:46+05:30 IST

ఉద్యోగులతో సంప్రదింపులు జరపాల్సిన ఆర్థికమంత్రి బుగ్గన ఎక్కడని ఎంపీ రఘురామ ప్రశ్నించారు.

ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే అన్న క్యాంటీన్‌లు ఎందుకు మూసేశారు?: రఘురామ

న్యూఢిల్లీ: గత ప్రభుత్వంలో సలహాదారులు మీడియాతో మాట్లాడడంపై ఇప్పటి ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో అభ్యంతరం వ్యక్తం చేసారని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ఇప్పుడు ఉద్యోగులతో సంప్రదింపులు చేయాల్సిన బుగ్గన జాడ లేదని విమర్శించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ శాసన, శాసన మండలి సభ్యుడు కాని సజ్జల అన్నింటా తానై వ్యవహరించడం తగదన్నారు. సజ్జల ఉద్యోగులను విభజించి పాలించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే అన్న క్యాంటీన్‌లు ఎందుకు మూసేశారని ప్రశ్నించారు. ప్రతి పథాకానికి జగనన్న, వైఎస్సార్ పేరు పెట్టే బదులుగా కనీసం ఒక్క పథకానికైనా ఎన్టీఆర్ పేరు పెట్టవచ్చు కదా! అని అన్నారు. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినంతమాత్రానా ఆ సామాజిక వర్గం ఓట్లు వస్తాయా? అని రఘురామ ప్రశ్నించారు.


ఉద్యోగుల కోర్కెలలో న్యాయం ఉందని, వారికి న్యాయబద్ధంగా రావాల్సిన వాటిని వాళ్లు అడుగుతున్నారని, కావాలని వారిలో ఎందుకు అశాంతిని లేపుతున్నారని రఘురామ ప్రశ్నించారు. సజ్జల సఖల పాత్రాభినయంపై కోర్టులో వేసిన కేసు ఇప్పటికీ విచారణకు రాలేదన్నారు. జిల్లాల విభజనపై అసెంబ్లీలో విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకోకుండా మంత్రుల కాళ్లు కట్టేసి, ఎమ్మెల్యేల నోళ్లు కుట్టేసి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఏ అర్హత లేని సలహాదారుడికి ఉద్యోగులను బెదిరించే హక్కు లేదన్నారు. ‘నేను ఉన్నాను, నేను వింటాను అని అన్న ముఖ్యమంత్రి… సజ్జల ఉన్నాడు, సజ్జల వింటాడు, సజ్జల చేస్తాడు’ అని ఏ రోజు చెప్పలేదని రఘురామకృష్ఞం రాజు అన్నారు.

Updated Date - 2022-01-28T20:39:46+05:30 IST