ఏపీ అప్పులపై రఘురామ ఏమన్నారంటే...
ABN , First Publish Date - 2021-10-07T21:07:57+05:30 IST
ఏపీ ప్రభుత్వం రుణ యజ్ఞం పేరిట అప్పులు తెస్తోందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.
న్యూఢిల్లీ: ఏపీ ప్రభుత్వం రుణ యజ్ఞం పేరిట అప్పులు తెస్తోందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త కోణాల్లో అప్పులు ఎలా తేవాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. గత ప్రభుత్వం ఏపీ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కింద రూ.3వేల కోట్లు రుణం తెచ్చిందని, జగన్ ప్రభుత్వం కొత్తగా జీవో ఇచ్చి ఆర్అండ్బీ ఆస్తులపై అప్పులు తేవాలని చూస్తోందన్నారు. కొవిడ్ కాలంలో ఎఫ్ఆర్బీఎం పరిధిని 5 శాతానికి పెంచారన్నారు. ప్రభుత్వానికి ప్రజల ఆస్తులు అమ్మే హక్కు ఉండదని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
చెత్త నుంచి సంపదను తయారు చేసే సెంటర్లకు పార్టీ రంగులు వేయడంపై.. హైకోర్టు మరోసారి ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని రఘురామ అన్నారు. ఇప్పటికైనా మూడు రంగులకు స్వస్తి చెప్పాలని సీఎంను కోరుకుంటున్నానన్నారు. ఉద్యోగులు డీఏ అడుగుతున్నారని, వారి బకాయిలూ పెద్ద ఎత్తున్న ఉన్నాయన్నారు. రిటైర్డు ఉద్యోగుల పెన్షన్ కూడా సరైన సమయానికి రావడం లేదన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ బిల్లులు 7రేట్లు పెంచారని ఆరోపించారు. ఎన్ఐఏకి ఇచ్చిన కోడి కత్తి కేసులో పురోగతి లేదంటున్నారని.. అది వారి దృష్టిలో చిన్న కేసని అన్నారు. సాగు దశలోనే గంజాయిని అదుపు చేయాలని రఘురామ కృష్ణంరాజు ప్రభుత్వానికి సూచించారు.