దేశంలో కరోనా వైరస్ చెలరేగిపోవడానికి అవే కారణం: రఘురామ్ రాజన్

ABN , First Publish Date - 2021-05-05T00:30:12+05:30 IST

దేశంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో చెలరేగిపోతోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి మహమ్మారి మరింతగా పంజా విసురుతోంది

దేశంలో కరోనా వైరస్ చెలరేగిపోవడానికి అవే కారణం: రఘురామ్ రాజన్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో చెలరేగిపోతోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి మహమ్మారి మరింతగా పంజా విసురుతోంది. ప్రతి రోజూ లక్షలాది కేసులు వెలుగుచూస్తుండగా, వేలాదిమంది దాని కబంధ హస్తాల్లో చిక్కుకుని ప్రాణాలు విడుస్తున్నారు. మరోవైపు, ఆసుపత్రులలో మౌలిక సదుపాయలు, ఆక్సిజన్, పడకల కొరత వేధిస్తోంది. ఫలితంగా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ మరణాలను, వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేకపోతోంది. 


కరోనా వైరస్ రెండో దశలో ఇంతలా చెలరేగిపోతుండడానికి కారణం ఏంటో భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పుకొచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన  ‘ముందుచూపు’, ‘నాయకత్వ లేమి’.. దేశంలో ప్రస్తుత పరిస్థితికి ఈ రెండే కారణమన్నారు.  ‘‘మీరు జాగ్రత్తగా ఉండి ఉంటే, అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే నేడు ఈ పరిస్థితి దాపురించి ఉండేది కాదు’’ అని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.


‘‘ప్రపంచంలో, ముఖ్యంగా బ్రెజిల్‌లో ఏం జరుగుతోందో ఎవరైనా గమనించి ఉంటే వైరస్ మళ్లీ విజృంభిస్తుందన్న విషయాన్ని గ్రహించగలిగి ఉండేవారు. అది మరింత బలోపేతమై వివిధ రూపాల్లో దాడి చేయడానికి రెడీగా ఉందని గుర్తించగలిగి ఉండేవారు’’ అని రాజన్ వివరించారు. వైరస్‌పై మనం విజయం సాధించేశామని గతంలో ప్రభుత్వాధికారులు చాలామంది ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. దేశంలో మళ్లీ మార్చిలో మొదలైన కేసుల సంఖ్య ఏప్రిల్ నాటికి పతాకస్థాయికి చేరాయన్నారు. 


ప్రస్తుతం చికాగో యూనివర్సిటీలో ఫైనాన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నరాజన్.. దేశంలో రెండోసారి కరోనా విజృంభణకు వ్యాక్సినేషన్ కార్యక్రమం నెమ్మదిగా జరుగుతుండడం కూడా మరో కారణమని వివరించారు. 

Updated Date - 2021-05-05T00:30:12+05:30 IST