న్యూ ఢిల్లీ/అమరావతి : వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఢిల్లీలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. విజయసాయిని ఢిల్లీకి పరిమితం చేయాలని జగన్ ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు. విజయసాయి సేవలను ఢిల్లీలో ఉపయోగించుకునేందుకే.. ఆయనను విశాఖకు దూరం చేస్తున్నట్లు తెలుస్తోందని చెప్పుకొచ్చారు. పార్టీ, ప్రభుత్వం కోసం తాను, విజయసాయి కలిసి ఢిల్లీలో పని చేస్తామని రఘురామ వ్యాఖ్యానించారు. కాగా.. పార్టీ, జగన్ ప్రభుత్వం కోసం కలిసి పనిచేస్తానని ఇలా ఆయన చెప్పడం ఇదే మొదటి సారేమో..!
కరెంట్ కష్టాలపై..
ఇదిలా ఉంటే.. ఏపీలో భవిష్యత్లో విద్యుత్ కష్టాలు ఎదుర్కొనాల్సి ఉందని ఎంపీ చెప్పుకొచ్చారు. విద్యుత్ సమస్య చాలా తీవ్రమైనదని.. దీనిపై సంబంధిత మంత్రి, అధికారులు మాట్లాడాలని.. కానీ సంబంధంలేని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడడం ఏంటి..? అని ప్రశ్నించారు. జగనన్న ట్రూ చార్జ్తో ప్రజలకు కష్టాలు వస్తే.. ఇప్పుడు జగనన్న కరెంట్ కోత పేరుతో కొత్త పథకం అమలు మొదలైందన్నారు. ఈ కొత్త పథకం శ్రీకాకుళం జిల్లా నుంచే ఆరంభమైందన్నారు. కాగా.. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో గృహ వినియోగదారులకు విద్యుత్ కోతలు విధించిన విషయం తెలిసిందే.