స్పీకర్ ఓంబిర్లాతో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ
ABN , First Publish Date - 2021-06-14T23:46:10+05:30 IST
స్పీకర్ ఓంబిర్లాతో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. ప్రివిలేజ్ కమిటీ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ: స్పీకర్ ఓంబిర్లాతో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. ప్రివిలేజ్ కమిటీ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్తో సహా తనపై దాడి చేసిన అధికారులందరిపై త్వరితగతిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రఘురామ కోరారు. వైసీపీ అధికారిక వెబ్సైట్ నుంచి తన పేరును తొలగించిన విషయాన్ని స్పీకర్ దృష్టికి ఆయన తీసుకెళ్లారు. 48 గంటల్లో తన పేరును వెబ్సైట్లో చేర్చకపోతే.. మరోసారి కలిసేందుకు స్పీకర్ అపాయింట్మెంట్ కోరారు. తన దిష్టిబొమ్మలను అధికార పార్టీ నేతలు తగులబెడుతున్నారని స్పీకర్ దృష్టికి రఘరామ తెచ్చారు.
వైసీపీ అధికారిక వెబ్సైట్లో ఎంపీల జాబితా నుంచి తన పేరు తొలగించారని రఘురామకృష్ణరాజు తెలిపిన విషయం తెలిసిందే. 48 గంటల్లోగా తిరిగి తన పేరును ఆ వెబ్సైట్లో చేర్చకపోతే, తనను స్వతంత్ర ఎంపీగా గుర్తించాలని పార్లమెంటు సెక్రటేరియట్ను కోరతానని అల్టిమేటం జారీ చేశారు. వైసీపీ అధికారిక వెబ్సైట్లో పార్టీ లోక్సభ, రాజ్యసభ సభ్యులు 28మంది పేర్లతో జాబితా పెట్టారని, ఇటీవల ఉపఎన్నికల్లో గెలుపొందిన తిరుపతి ఎంపీ గురుమూర్తి పేరును కూడా ఆ జాబితాలో చేర్చారని గుర్తు చేశారు. తనను పార్టీ నుంచి బహిష్కరించనప్పుడు, పార్టీ వెబ్సైట్లో తన పేరును ఎందుకు తొలగించారో స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు.