ఆ వార్తల్లో నిజం లేదు: రఘురామకృష్ణరాజు

ABN , First Publish Date - 2021-04-07T23:11:23+05:30 IST

సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్‌.. రిజెక్ట్‌ అయ్యిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఎంపీ రఘురామకృష్ణరాజు కొట్టిపారేశారు.

ఆ వార్తల్లో నిజం లేదు: రఘురామకృష్ణరాజు

అమరావతి: సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్‌.. రిజెక్ట్‌ అయ్యిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఎంపీ రఘురామకృష్ణరాజు కొట్టిపారేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బెయిల్‌ సర్టిఫైడ్‌ కాపీ ఇవ్వమని కోర్టు కోరిందని, రిజెక్ట్‌ చేయలేదని తెలిపారు. శుక్రవారం అవసరమైన పత్రాలను దాఖలు చేస్తామని పేర్కొన్నారు. అడ్డుకోవడానికి వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారని, వచ్చేవారం ఈ కేసుపై వాదనలు కచ్చితంగా ఉంటాయని భావిస్తున్నామని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.


అక్రమాస్తుల కేసు విచారణను వేగవంతం చేసేందుకు వీలుగా జగన్, ఆయన సహనిందితుడు ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణరాజు, హైదరాబాద్‌ సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరూ అరాచకాలకు పాల్పడుతున్నారని.. చిన్న చిన్న సాకులతో కోర్టుకు రాకుండా తప్పించుకుంటున్నారని తెలిపారు. బెయిల్‌ ద్వారా సంక్రమించిన స్వేచ్ఛను జగన్‌ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. బెయిల్‌ ఎందుకు రద్దుచేయాలో వివరిస్తూ 26 అంశాలను, ఉప అంశాలను పిటిషన్‌లో ప్రస్తావించారు. సీఎంగా జగన్‌ బాధ్యతలు స్వీకరించాక సాక్షులను ప్రభావితులను చేస్తున్నారని కోర్టుకు రఘురామకృష్ణరాజు తెలిపారు.

Updated Date - 2021-04-07T23:11:23+05:30 IST