Rachakonda.. నిరుద్యోగులకు అండ.. పోలీస్ ఉచిత శిక్షణకు ఏర్పాట్లు
ABN , First Publish Date - 2022-03-21T17:03:55+05:30 IST
Rachakonda.. నిరుద్యోగులకు అండ.. పోలీస్ ఉచిత శిక్షణకు ఏర్పాట్లు
- ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సీపీ మహేష్ భగవత్
హైదరాబాద్ సిటీ : ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో నిరుద్యోగులు శిక్షణకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో పేద, మధ్య తరగతి నిరుద్యోగులకు ఉచిత పోలీస్ రిక్రూట్మెంట్ శిక్షణ అందించి వారు ఉద్యోగాలు సాధించేందుకు కృషి చేయాలని రాచకొండ సీపీ నిర్ణయించారు. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలిసింది.
ఇప్పటికే 3 వేల మందికి శిక్షణ..
గతంలో పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్స్ ప్రక్రియలో భాగంగా రాచకొండలో ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి సుమారు 3వేల మంది పేద, మధ్యతరగతి అభ్యర్థులకు శిక్షణ అందించారు. 2018లో ప్రభుత్వం 18,142 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీచేసింది. ఆ నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన యువకులకు పోలీస్ ఉద్యోగానికి సంబంఽధించిన ఉచిత శిక్షణను ఇవ్వాలని సీపీ నిర్ణయించారు. దాంతో మూడు జిల్లాల కలెక్టర్ల సమన్వయంతో అభ్యర్థులకు ఉచిత శిక్షణకు శ్రీకారం చుట్టారు. అంతకంటే ముందే 1,250 మందికి ఉచితంగా శిక్షణ ఇచ్చిన అనుభవం ఉండటంతో 2018లో 1,500 మందికి శిక్షణ ఇచ్చారు.
మెరిట్ అభ్యర్థుల ఎంపిక..
ఉచిత శిక్షణకు ముందుగా పోలీస్ ఉద్యోగానికి తగిన అర్హతలు, ప్రతిభా సామర్థ్యాలు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అంబర్పేటలోని రాచకొండ కార్హెడ్ క్వార్టర్స్ మైదానంలో మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేయడానికి 800మీటర్ల పరుగు పందెం, ఎత్తు, బరువు, ఛాతీ, తదితర పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షలో నెగ్గిన సుమారు 2వేల మంది అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి సీపీ మహేష్ భగవత్ నిర్ణయించారు. ఇప్పటికే గత రెండు పర్యాయాలలో 3వేల మందికి శిక్షణ ఇవ్వడంతో ఈ ఏడాది మరో 2వేల మందికి శిక్షణ ఇచ్చి 5వేల మంది అభ్యర్థుల మార్కును చేరుకుని, రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడానికి కసరత్తు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం, అంబర్పేట, యాదాద్రి భువనగిరిలతోపాటు, మరో మూడు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.