
Hyderabad : నకిలీ విద్యా ధ్రువీకరణ పత్రాలను ఇస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసినట్టు రాచకొండ సీపీ మహేష్ భగవత్(Rachakonda CP Mahesh Bhagawath) తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ(Telangana)తో పాటు కర్ణాటక(Karnataka) యూనివర్సిటీల సర్టిఫికెట్ను ఈ ముఠా ఇష్యూ చేస్తున్నారని తెలిపారు. చైతన్య పూరి పోలీస్ స్టేషన్(Police station)లో దీనిపై కేసు నమోదైందన్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రదారి రోహిత్ కుమార్తో పాటు మరో ముగ్గురుని అరెస్ట్ చేశామని మహేష్ భగవత్ వెల్లడించారు. కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University), జేఎన్టీయూ(JNTU), ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(Nagarjuna University)ల సర్టిఫికెట్స్ను ఇష్యూ చేస్తున్నారని సీపీ తెలిపారు. రోహిత్ అనే వ్యక్తి ఐటి ఉద్యోగి అని... ఫేక్ సర్టిఫికెట్స్ను తయారు చేసి డబ్బులు దండుకుంటున్నాడని వెల్లడించారు. శ్రీలక్ష్మి కన్సల్టెంట్స్ ద్వారా ఈ దందా కొనసాగిస్తున్నారన్నారు. ఒక్కో సర్టిఫికెట్కు 30 వేల నుంచి 40 వేలు తీసుకుంటున్నారన్నారు. లేని కాలేజీ పేర్లు కూడా పెట్టి సర్టిఫికెట్స్ ఇష్యూ చేస్తున్నారన్నారు. విదేశాలకు వెళ్లే వారు ఎక్కువగా ఈ సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారని వెల్లడించారు. ఇప్పటి వరకూ 20 వరకు సర్టిఫికెట్స్ ఇచ్చినట్టు తెలిసిందన్నారు. గత ఆరు నెలల నుంచి ఈ దందా చేస్తున్నారన్నారు. నిందితుల వద్ద నుంచి నకిలీ సర్టిఫికెట్స్, ల్యాప్ టాప్స్, ప్రింటర్స్, మొబైల్స్ సీజ్ చేశామని మహేష్ భగవత్ వెల్లడించారు.