రాగి పంట సాగుకు ప్రోత్సాహం

ABN , First Publish Date - 2020-10-31T01:37:26+05:30 IST

మన్యంలో రాగి (చోడి) పంట సాగును ప్రోత్సహిస్తామని, పండిన పంటను రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్‌బీకే) కొనుగోలు చేస్తామని ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ తెలిపారు.

రాగి పంట సాగుకు ప్రోత్సాహం
సమావేశంలో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌, పాల్గొన్న వివిధ శాఖల అధికారులు


మద్దతు ధర క్వింటా రూ.3,295 

రెండో తేదీ నుంచి ఆర్‌బీకేల్లో కొనుగోళ్లు

ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ వెల్లడి


పాడేరు, అక్టోబరు 30: మన్యంలో రాగి (చోడి) పంట సాగును ప్రోత్సహిస్తామని, పండిన పంటను రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్‌బీకే) కొనుగోలు చేస్తామని ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ తెలిపారు. వ్యవసాయ శాఖ, వెలుగు, మార్క్‌ఫెడ్‌ అధికారులు, మార్కెట్‌ కమిటీల చైర్మన్లతో శుక్రవారం ఇక్కడ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్క్‌ఫెడ్‌ నేతృత్వంలో వెలుగు గ్రామైక్య సంఘాల ద్వారా నవంబరు రెండో తేదీ నుంచి ఆర్‌బీకేల్లో రాగులు కొనుగోలు చేస్తామన్నారు. గిరిజన రైతులు దళారులను ఆశ్రయించకుండా తమ ఆహార ధాన్యాలను ఆర్‌బీకేల్లో విక్రయించాలన్నారు. రాగులు క్వింటా రూ.3,295, ధాన్యం రూ.1,860లకు కొనుగోలు చేస్తారని, ప్రభుత్వం పది రోజుల్లో డబ్బులు చెల్లిస్తుందని పీవో పేర్కొన్నారు. రైతులు ఈ పంటలను ఆర్‌బీకేల్లో విక్రయించేలా అగ్రికల్చరల్‌ అసిస్టెంట్లు, గ్రామ వాలంటీర్ల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. ఆధార్‌ నమోదు, సమస్యల పరిష్కరిష్కారానికి పాడేరు, అరకులోయలో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. చింతపల్లిలో త్వరలో మొబైల్‌ ఆధార్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమవేశంలో పాడేరు, అరకులోయ, చింతపల్లి ఏఎంసీ ఛైర్‌పర్సన్లు ఎం.గాయత్రీదేవి, కె.అనిత, జె.హలియారాణి, మార్క్‌ఫెడ్‌ డీఎం కె.అరుణ, వ్యవసాయ శాఖ డీడీ మోహనరావు, వెలుగు ఏపీడీ ఎం.నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ పాడేరు, చింతపల్లి, అరకులోయ ఏడీలు రత్నకుమారి, నవీన్‌, శ్రీధర్‌, పీఏవో బి.భాస్కరావు, వెలుగు డీపీఎం సత్యనాయుడు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-10-31T01:37:26+05:30 IST