దుర్గగుడి ఫ్లైఓవర్ ఓపెనింగ్‌పై కృష్ణబాబు ఏమన్నారంటే...

ABN , First Publish Date - 2020-09-19T00:03:30+05:30 IST

కేంద్ర మంత్రి గడ్కరీకి కరోనా కారణంగా దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం ఆగిందని ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. గడ్కరీ

దుర్గగుడి ఫ్లైఓవర్ ఓపెనింగ్‌పై కృష్ణబాబు ఏమన్నారంటే...

అమరావతి: కేంద్ర మంత్రి గడ్కరీకి కరోనా కారణంగా దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం ఆగిందని ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. గడ్కరీ ప్రారంభించాకే ఫ్లైఓవర్‌పై రాకపోకలకు అనుమతిస్తామని వెల్లడించారు. ‘ఎన్డీబీ నిధులతో చేపడుతున్న రోడ్ల నిర్మాణ బిడ్డింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాం. విజయవాడ, వైశాఖలో శనివారం నుంచి సిటీ బస్సులు రన్ చేస్తున్నాం. కోవిడ్ నిబంధనలు పాటించి సిటీ బస్సులను తిప్పుతాం. 50 శాతం ఆక్యుపెన్సీతోనే సిటీ బస్సులను నడపడం భారీగా నష్టం చేకూర్చే అంశంగా ఉంటుంది. బస్సుల్లో స్టాడింగుకు అనుమతించడం లేదు. వృద్ధులని బస్సు ప్రయాణాలు చేయొద్దని సూచిస్తున్నాం. కానీ కొందరు అత్యవసర పరిస్థితులంటూ కొందరు వృద్ధులు వస్తున్నారు. వృద్ధుల బస్ ప్రయాణాలను నిరుత్సాహపర్చేందుకే బస్సుల్లో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలను తాత్కాలికంగా రద్దు చేశాం. సాధారణ పరిస్థితులు రాగానే సీనియర్ సిటీజన్లకు రాయితీని వర్తింప చేస్తాం’ అని పేర్కొన్నారు.


తెలంగాణ ప్రభుత్వం ఇష్టపడటం లేదు..

‘తెలంగాణ ప్రభుత్వం బస్ సర్వీసులను పెంచడానికి ఇష్టపడడం లేదు. ఏపీని తగ్గించుకోమని సూచిస్తోంది. తెలంగాణ సూచనల మేరకు సర్వీసులను తగ్గించుకోవవడానికి సిద్దంగా ఉన్నాం. అయితే ఏపీ తగ్గించుకునే 1.10 లక్షల కిలోమీటర్ల మేర రవాణను ప్రైవేట్ ఆపరేటర్లకు అవకాశం లభిస్తుంది. ఏపీ తిప్పే సర్వీసుల కంటే డబుల్ సర్వీసులు తిప్పుతామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.  అయితే బెజవాడ-హైదరాబాద్ రూట్లో మాత్రమే డబుల్ సర్వీసులు తిప్పుతామని తెలంగాణ అంటోంది. మిగిలిన రూట్ల గురించి ప్రస్తావించడం లేదు. ఏపీ 72 రూట్లల్లో బస్సులు తిప్పుతుంటే.. తెలంగాణ 27 రూట్లల్లో మాత్రమే బస్సులు నడుపుతోంది’ అని కృష్ణబాబు చెప్పారు.

Updated Date - 2020-09-19T00:03:30+05:30 IST