కుహనా లౌకికవాదాన్ని వదలండి... కాంగ్రెస్‌కు శివసేన హితవు...

ABN , First Publish Date - 2022-03-16T18:07:56+05:30 IST

భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనడానికి ప్రత్యామ్నాయ

కుహనా లౌకికవాదాన్ని వదలండి... కాంగ్రెస్‌కు శివసేన హితవు...

ముంబై : భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనడానికి ప్రత్యామ్నాయ వ్యూహాలను రూపొందించాలని, కుహనా లౌకికవాదాన్ని వదిలిపెట్టాలని కాంగ్రెస్ పార్టీకి శివసేన హితవు పలికింది. ఈ రెండు పార్టీలు మహారాష్ట్రలోని మహావికాస్ అగాడీ కూటమిలో భాగస్వాములే. ఈ కూటమిలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ కూడా ఉంది. 


శివసేన పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో కాంగ్రెస్ పునరుజ్జీవానికి సూచనలు చేసింది. కుహనా లౌకికవాదాన్ని వదిలిపెట్టాలని, బీజేపీని ఎదుర్కొనడానికి ప్రత్యామ్నాయ వ్యూహాన్ని రచించాలని సలహా ఇచ్చింది. ‘ది కశ్మీర్ ఫైల్స్’ వంటి సినిమాల ద్వారా, హిజాబ్ వివాదం ద్వారా బీజేపీ సృష్టించిన భావాలను తిప్పికొట్టేందుకు ప్రత్యామ్నాయ వ్యూహాలను రూపొందించాలని తెలిపింది. బీజేపీ సైబర్ ఆర్మీ బూటకపు కథనాలను సృష్టిస్తోందని ఆరోపించింది. ఇటువంటి కథనాలను బీజేపీ నేతలు బెంగాల్, మహారాష్ట్రలలో కూడా ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. కానీ అవి పని చేయడం లేదని పేర్కొంది. ఉత్తర ప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా పోరాడారని తెలిపింది. బీజేపీ మద్దతుగల వీపీ సింగ్ ప్రభుత్వ హయాంలోనే కశ్మీరు నుంచి పండిట్లు వెళ్ళిపోయారని కాంగ్రెస్ చెప్పాలని తెలిపింది. బీజేపీకి సన్నిహితుడైన జగ్‌మోహన్ దాల్మియా అప్పట్లో జమ్మూ-కశ్మీరుకు గవర్నర్‌గా ఉండేవారని చెప్పాలని సలహా ఇచ్చింది.


ఈ బూటకపు కథనాలపై కాంగ్రెస్ పోరాడలేకపోతోందని పేర్కొంది. పాతబడిన, సంప్రదాయ పద్ధతుల్లో బీజేపీని ఎన్నికల్లో ఎదుర్కొనడం సాధ్యం కాదని తెలిపింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతలపై కూడా ఈ సంపాదకీయం విరుచుకుపడింది. కేవలం గాంధీ కుటుంబం మాత్రమే కాంగ్రెస్‌ను నడపగలదని, ఈ నేతలు నిష్ప్రయోజకులని తెలిపింది. ఇదంతా ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని, అయితే ప్రతిపక్షాల ఐక్యత కోసం కాంగ్రెస్ పునరుద్ధరణ తప్పనిసరి అని తెలిపింది. 


Updated Date - 2022-03-16T18:07:56+05:30 IST