క్విట్ ఇండియా ఉద్యమ ఘనత అమర వీరులదే..
ABN , First Publish Date - 2022-08-10T05:18:50+05:30 IST
సంపూర్ణ స్వాతంత్య్రం ప్రకటించి దేశం నుంచి బ్రిటిష్ పాలకులు వెళ్లిపోవాలని నినదించిన ఖ్యాతి అమరులదేనని పలువురు నాయకులు అన్నారు.
పాలకొల్లు అర్బన్, ఆగస్టు 9: సంపూర్ణ స్వాతంత్య్రం ప్రకటించి దేశం నుంచి బ్రిటిష్ పాలకులు వెళ్లిపోవాలని నినదించిన ఖ్యాతి అమరులదేనని పలువురు నాయకులు అన్నారు. స్థానిక వీవర్స్ కాలనీలోని సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం క్విట్ ఇండియా డే నిర్వహించారు. పార్టీ కార్యదర్శి జవ్వాది శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆనాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడితే నేటి పాలకులు కార్పొరేట్, ప్రైవేటీకరణ పేరుతో సంపదను సామ్రాజ్య వాదులకు దోచిపెడుతున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్, చల్లా సోమేశ్వరరావు, వై.అజయ్కుమార్, బాసిన శ్యామల, దొండపాటి రోజామణి, పి.సత్యనారాయణ పాల్గొన్నారు.
నరసాపురం: దేశ స్వాతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియా రోజును పురస్కరించుకొని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో ప్రదర్శన నిర్వహిం చారు. అభివృద్ధి ఫలాలను నేటి పాలకులు కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కవురు పెద్ది రాజు, ముచ్చర్ల త్రిమూర్తులు, బూడిద జోగేశ్వరరావు, పొగాకు నారాయణ రావు, మంచిలి నీలకఠం, శివరాజు, సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పెంటపాడు: బీజేపీకి జాతీయ జెండా ఎగురవేసే అర్హత లేదని, స్వాతంత్ర ఫలాలను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అందించి సామాన్య ప్రజలపై భారం మోపుతుందని వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సిరపరపు రంగారావు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చిర్లా పుల్లారెడ్డి, బంకూరు నాగేశ్వరరావు విమర్శించారు. పెంటపాడులో సీఐటీయూ, రైతు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ ప్రదర్శన చేపట్టారు. కొవ్వూరి గాంధీరెడ్డి, కరక వెంకట్రావు, లింగంపల్లి రవితేజ, గొట్టపు రాజేష్, జి.సాయి, యాండ్రపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.