ప్రధాని పనికొస్తారా, లేదా అనేది ప్రశ్న కాదు: రాహుల్

ABN , First Publish Date - 2021-02-27T20:44:32+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు ..

ప్రధాని పనికొస్తారా, లేదా అనేది ప్రశ్న కాదు: రాహుల్

తూత్తుకుడి: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. తమిళనాడులో తూత్తుకుడి వీఓసీ కాలేజీలో జరిగిన ముఖాముఖీలో శనివారంనాడు రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ప్రధాని పనికొస్తారా, పనికిరారా అనేది ప్రశ్న కాదని, ఆయన ఎవరికి ఉపయోగపడతారు, ఎవరికి ఉపయోగపడరనేదే అసలైన ప్రశ్న అని పేర్కొన్నారు. ప్రధాని ఆ ఇద్దరు వ్యక్తులకే పూర్తిగా పనికొస్తారని అన్నారు. 'హమ్‌దో మమారే దో' అనే తరహాలో ఆ ఇద్దరు ప్రధానిని ఉపయోగించుకుని తమ సంపదను పెంచుకుంటూ పోతుంటారని, పేద ప్రజలకు ప్రధాని ఏమాత్రం ఉపయోగపడరని ఛలోక్తులు విసిరారు. మోదీ తన మిత్రులైన ఇద్దరు బడా పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తున్నారంటూ రాహుల్ ఇటీవల కాలంలో పలుమార్లు ఇదే తరహా విమర్శలు గుప్తిస్తున్నారు.


మహిళా రిజర్వేషన్‌కు మద్దతు

పార్లమెంటుతో పాటు న్యాయవ్యవస్థలోనూ మహిళా రిజర్వేషన్‌కు తాను పూర్తి మద్దతు ఇస్తున్నట్టు రాహుల్ తెలిపారు. ప్రతి రంగంలోనూ తాము ఎలా రాణించాలని పురుషులు భావిస్తారో అదే విధంగా తమతో సమానంగా మహిళలు కూడా అన్ని రంగాల్లోనూ ముందుండాలనే దృక్కోణంతో వారిని చూడాలని అన్నారు.


ఆరేళ్లుగా పద్ధతి ప్రకారం దాడి..

దేశాన్ని ఏకతాటిపై నిలుపుతున్న ఎన్నికైన వ్యవస్థలు, పత్రికా స్వేచ్ఛపై గత ఆరేళ్లుగా ఒక పద్ధతి ప్రకారం దాడి జరుగుతోందని రాహుల్ విమర్శించారు. ప్రజాస్వామ్యం క్రమంగా మరణశయ్యపైకి చేరుతోందన్నారు. సంస్థాగత సమతుల్యతను ఆర్ఎస్ఎస్ ధ్వసం చేస్తోందని రాహుల్ ఆరోపించారు. కాగా, దీనికి ముందు రాహుల్ గాంధీ తూత్తుకుడిలో రోడ్‌షోలో పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T20:44:32+05:30 IST