కొండాపూర్ గుట్టపై క్వార్ట్జ్ పట్టీ గుర్తింపు
ABN , First Publish Date - 2021-09-16T05:17:02+05:30 IST
సిద్దిపేట జిల్లా దూళిమిట్ట మండలంలోని కొండాపూర్లో గుట్టతో సర్వాయిపాపన్నకు సంబంధమున్న కథలు ఎన్నో ప్రాచుర్యంలో ఉన్నాయి.
కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ వెల్లడి
మద్దూరు, సెప్టెంబరు 15: సిద్దిపేట జిల్లా దూళిమిట్ట మండలంలోని కొండాపూర్లో గుట్టతో సర్వాయిపాపన్నకు సంబంధమున్న కథలు ఎన్నో ప్రాచుర్యంలో ఉన్నాయి. కాగా ఈ గుట్టమీద సహజ సిద్ధమైన నీటి గుండం, శిథిల శివాలయం ఉన్నాయి. శివాలయం నుంచి గుట్ట కింది భాగం వరకు గల తెల్లని పట్టీ మధ్యలో నలుపు, పచ్చని రంగులు కలిగిన క్వార్ట్జ్ పట్టీని గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. బుధవారం కొండాపూర్ గుట్టను సందర్శించి గుట్ట పై నుంచి కింది భాగం వరకు క్వార్ట్జ్ పట్టీని పరిశీలించారు. అనంతరం ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. గుట్ట పై నుంచి కింది వరకు ఏకరీతిగా ఉన్న ఈ ఈ క్వార్ట్జ్ గీత గుట్టకు రక్తనాళంలా కనిపించిందని చెప్పారు. ఈ రాతి సిరలు గ్రానైట్ ఏర్పడటంలో చివరి దశలో అంతర్గతంగా వచ్చి బయటపడినట్టుగా వివరించారు. ఇలాంటివి ఎక్కువగా రాతి ఉపరితలం మీద సమాంతరంగా విస్తరించి ఉంటాయి. అక్కడక్కడ పక్కకు జరిగిఉంటాయని, చిన్నచిన్న స్థానభ్రంశాలతో కన్పిస్తుంటాయని తెలిపారు. ఈ రాతి సిరలు భూగర్భంలో సహజసిద్ధంగా రూపొందే క్రమంలో శిలలలోని ప్లూటాన్ రకానికి చెందిన బహిర్గతాలు కనిపించే రూపవైవిధ్యంలో భాగమే ఈ రాతి సిరలు అని వివరిం చారు. సాధారణంగా ఫైన్ గ్రెయిన్డ్, డామినెంట్ బ్లాక్ ప్లాకీ మినరల్స్ కారణంగా బూడిద రంగులో కనిపించే ఈ గ్రానైట్లు ప్రస్తుత కాలానికి 280 నుంచి 250 కోట్ల సంవత్సరాల ముందు వయస్సు కల్గిఉంటాయని తెలిపారు.