ఖతార్లో కరోనా కేసులు @ 100,000
ABN , First Publish Date - 2020-07-12T15:18:28+05:30 IST
ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా.. అటు గల్ఫ్ను కూడా గడగడలాడిస్తోంది. ప్రధానంగా సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, యూఏఈలో దీని ప్రభావం తీవ్రంగా ఉంది.
ఖతార్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా.. అటు గల్ఫ్ను కూడా గడగడలాడిస్తోంది. ప్రధానంగా సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, యూఏఈలో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఖతార్లో అంతకంతకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే లక్ష మార్కును దాటేశాయి. శనివారం కూడా 498 కొత్త కేసులు నమోదు కాగా... 701 రికవరీలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఆ దేశంలో కోవిడ్ బారిన పడ్డ వారి సంఖ్య 1,03,128కు చేరగా... మొత్తం కోలుకున్న వారు 98,934 మంది అయ్యారు.
కాగా, ఇప్పటికే దేశవ్యాప్తంగా 146 మందిని ఈ మహమ్మారి బలిగొంది. ఒకవైపు పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్న మరోవైపు ఖతార్ కర్ఫ్యూ ఆంక్షలు సడలిస్తోంది. నాలుగు దశల్లో పూర్తిగా కర్ఫ్యూ ఆంక్షలు తొలగించేందుకు ఖతార్ నిర్ణయం తీసుకుంది. మొదటి దశ జూన్ 15న ప్రారంభం కాగా... రెండో దశ జూలై 1న మొదలెట్టింది. దీనిలో భాగంగా పరిమిత సంఖ్యలో రెస్టారెంట్లు, బీచ్లు, పార్క్స్ తెరచుకునే వీలు కల్పించారు అధికారులు. ఇక జీసీసీ(గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్)లో గల ఆరు దేశాల్లో సౌదీ అరేబియా తర్వాత ఖతార్లోనే అత్యాధిక కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ రెండు దేశాల్లోనే 489,000 కరోనా పాజిటివ్ కేసులు, 3వేల మరణాలు నమోదయ్యాయి.