ఢిల్లీ ఎయిర్ పోర్టులో పీవీ సింధుకు ఘనస్వాగతం
ABN , First Publish Date - 2021-08-03T21:50:29+05:30 IST
ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న పీవీ సింధుకు ఘన స్వాగతం లభించింది.
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న పీవీ సింధుకు ఘన స్వాగతం లభించింది. క్రీడా శాఖ, బ్యాడ్మింటన్ అకాడమీ అధికారులు సింధుకు స్వాగతం పలికారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఢిల్లీ వచ్చి సింధుకు ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి సింధు మినిస్ట్రీ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడనున్నారు.
వరుసగా రెండు ఒలింపిక్స్ పతకాలతో చరిత్ర సృష్టించిన సింధు స్వదేశం చేరుకున్నారు. తర్వాత వీలైన సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసే అవకాశముంది. ఈ మర్యాదపూర్వక భేటీలో మోదీతో కలిసి సింధు ఐస్క్రీమ్ పార్టీ చేసుకోనున్నారు.