ఉద్యమాలతోనే హక్కులు సాకారం
ABN , First Publish Date - 2020-10-30T11:35:13+05:30 IST
వందేళ్ల సుదీర్ఘ పోరాటంలో శ్రామిక, కార్మిక వర్గానికి ఏఐటీయూసీ భరోసాగా నిలిచిందని, ఉద్యమాలతోనే అనేక హక్కులు సాకారమయ్యాయని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ ..
సీపీఐ సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు
కొత్తగూడెంలో కదంతొక్కిన కార్మిక శ్రేణులు
ఏఐటీయూసీ వందేళ్ల పైలాన్ను ఆవిష్కరించిన నేతలు
కొత్తగూడెం, అక్టోబరు 29: వందేళ్ల సుదీర్ఘ పోరాటంలో శ్రామిక, కార్మిక వర్గానికి ఏఐటీయూసీ భరోసాగా నిలిచిందని, ఉద్యమాలతోనే అనేక హక్కులు సాకారమయ్యాయని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు అన్నారు. ఏఐటీయూసీ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో గురువారం కార్మికులతో మహా ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీ అనంతరం అండర్ బ్రిడ్జి సెవెన్ హిల్స్లో ఏర్పాటు చేసిన ఏఐటీయూసీ వందేళ్ల పైలాన్ను పువ్వాడ నాగేశ్వరరావు, కూనంనేని సాంబశివరావు ఆవిష్కరించారు. అనంతరం శేషగిరి భవన్లో ఏర్పాటుచేసిన సభలో పువ్వాడ నాగేశ్వరరావు మాట్లాడారు.
కార్మిక శ్రేయస్సుకు, స్వాతంత్య్రం కోసం పోరాటాలు సాగించిన చరిత్ర ఏఐటీయూసీకి మాత్రమే ఉందన్నారు. త్యాగాలతో, పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాసే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. కార్మికోద్యమాలకు ఏఐటీయూసీ కార్ఖానా అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి ఎస్కే. సాబిర్పాషా, వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. అయోధ్య, రావులపల్లి రాంప్రసాద్, ఏఐటీయుసీ జిల్లా కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు నరాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.