పుట్ట మధు అరెస్ట్ వ్యవహారం ఏపీ పోలీసులకు తెలియదట
ABN , First Publish Date - 2021-05-08T21:17:21+05:30 IST
పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అరెస్ట్పై పశ్చిమ గోదావరి పోలీసులు ఏమాత్రం నోరు మెదపడం లేదు. పుట్ట
హైదరాబాద్: పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అరెస్ట్పై పశ్చిమ గోదావరి పోలీసులు ఏమాత్రం నోరు మెదపడం లేదు. పుట్ట మధు అరెస్ట్పై తమ వద్ద ఎలాంటి సమాచారమే లేదని పేర్కొంటున్నారు. అయితే పుట్టా మధు కోసం శుక్రవారం మొత్తం తెలంగాణ పోలీసులు భీమవరంలో ఉన్నారు. భీమవరంలో ఉంటూ మధు కోసం తీవ్రంగా గాలించారు. దాదాపు ఎనిమిది మంది తెలంగాణ పోలీసులు భీమవరంలోని పలు హోటళ్లలో గాలించారు. అంతేకాకుండా గదులు కావాలని పలు లాడ్జీలు, హోటల్స్కు కూడా తెలంగాణ పోలీసులు తిరిగినట్లు హోటళ్ల సిబ్బంది పేర్కొంటున్నారు. పుట్టా మధు కోసం ఆయా హోటళ్లలో పోలీసులు గాలించిన దృశ్యాలు మాత్రం హోటళ్ల సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇంత జరిగినా, పశ్చిమ గోదావరి పోలీసులు పుట్ట మధు అరెస్ట్ సమాచారం తమకు లేదని పేర్కొంటున్నారు. అయితే ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలను దృష్టిలో పెట్టుకునే అలా అంటున్నట్లు తెలుస్తోంది.
పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్ట మధు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. ఆయనను పోలీసులు భీమవరంలో అరెస్ట్ చేశారు. కాగా.. గత కొన్ని రోజులుగా పుట్ట మధు అజ్ఞాతంలో ఉన్నారు. శుక్రవారం కూడా మధు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో ఆయన ఎక్కడ ఉన్నారన్న అంశం మిస్టరీగా మారింది. ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తర్ఫకు గురైన ఈటల రాజేందర్కు పుట్ట మధు సన్నిహితంగా మెలగడంతోపాటు ఆయనతో కలిసి వ్యాపార లావాదేవీలు కూడా నిర్వహించినట్లు, దీంతో ఆయనపై సీఎం కేసీఆర్ అసంతృప్తితో ఉన్నందునే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం జరిగింది. మరోవైపు మూడు నెలల క్రితం జరిగిన హైకోర్టు న్యాయవాదులు వామన్రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధుపై వచ్చిన ఆరోపణలపై పోలీసులు విచారణ జరుపుతున్నారనే చర్చ కూడా జరుగుతోంది.