Joe Biden: పుతిన్ అంచనా తప్పు.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు..!
ABN , First Publish Date - 2022-03-02T17:35:34+05:30 IST
ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్కు అమెరికా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
వాషింగ్టన్: ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్కు అమెరికా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ను రష్యా బలహీనపర్చలేదని, ఉక్రెయిన్పై దాడులకు వ్లాదిమిర్ పుతిన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బలగాలతో దాడి చేయించి ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకున్నా.. అక్కడి ప్రజల మనసులను గెలుచుకోలేరని పేర్కొన్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడులు దుర్మార్గమని మండిపడ్డారు. పుతిన్ను ప్రపంచం ఏకాకి చేయాలని బైడెన్ పిలుపు ఇచ్చారు. ఉక్రెయిన్లో ప్రతి భాగాన్ని కాపాడతామన్నారు. రష్యా ఆర్థిక వ్యవస్థను స్థంభింపచేస్తామన్నారు. అమెరికా గగనతలం నుంచి రష్యా విమానాల రాకపోకలపై నిషేధం విధించినట్లు తెలిపారు. ఉక్రెయిన్ తరఫున అమెరికా సేనలు యుద్ధం చేయవని తెలిపారు. రష్యాలో ఆర్థిక సంక్షోభానికి పుతినే కారణమని జో బైడెన్ అన్నారు.
"నియంతలను కట్టడి చేయకపోతే వారు మరింత విధ్వంసం సృష్టిస్తారు. వాళ్ల దాడులను విస్తరిస్తారు. ఈ క్రమంలో అమెరికా సహా ప్రపంచ దేశాలు ముప్పుకు గురయ్యే అవకాశాలు మరింత పెరుగుతాయి. అందుకే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాటో కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. పుతిన్ పక్కా ప్రణాళికతోనే ఈ యుద్ధాన్ని ప్రారంభించారు. పాశ్చాత్య దేశాలు, నాటో ఈ దాడులకు స్పందించవని ఆయన భావించారు. కానీ పుతిన్ అంచనా తప్పు. మేము ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము" అని బైడెన్ చెప్పుకొచ్చారు. కాగా బుధవారం రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండో విడత చర్చలు జరగనున్నాయి. తొలి విడత చర్చల్లో ప్రాథమిక డిమాండ్లపై ఇరు దేశాలు పట్టు పట్టాయి. తక్షణమే యుద్ధాన్ని విరమించాలని, ప్రత్యేక విధానం ద్వారా తమను ఈయూలో చేర్చాలని ఉక్రెయిన్ కోరుతోంది.