మత్తు పదార్థాల విక్రేతలపై ఉక్కుపాదం మోపండి
ABN , First Publish Date - 2021-06-13T06:41:21+05:30 IST
మత్తు పదార్థాలను విక్రయిస్తూ.. సమాజానికి చీడపురుగుల్లా పరిణమించిన వారిపై ఉక్కుపాదం మోపాలని డీఐజీ క్రాంతి రాణా టాటా ఆదేశించారు.
డీఐజీ క్రాంతి రాణా టాటా
తిరుపతి(నేరవిభాగం), జూన్ 12: మత్తు పదార్థాలను విక్రయిస్తూ.. సమాజానికి చీడపురుగుల్లా పరిణమించిన వారిపై ఉక్కుపాదం మోపాలని డీఐజీ క్రాంతి రాణా టాటా ఆదేశించారు. అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడితో కలిసి శనివారం స్థానిక పోలీసు అతిథి భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో సమీక్షించారు. మత్తు పదార్థాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. పాన్పరాగ్, గుట్కా, తదితర నిషేధిత పొగాకు ఉత్పత్తులను విక్రయించే వారిపై నిఘా పెట్టి, కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా మూలాలను గుర్తించి, నిర్మూలించాలని సూచించారు. యువతను ప్రలోభాలకు గురిచేసి, తప్పుదారి పట్టిస్తున్నవారు ఎంతటివారైనా, వారి వెనుక ఎవరున్నా ఉపేక్షించొద్దని స్పష్టం చేశారు. అధికారుల్లో చిత్తశుద్ధి ఉంటే ఎంతటి సమస్యనైనా పరిష్కరించవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా పదోన్నతులు పొందిన సీఐలు డీఐజీని మర్యాదపూర్వకంగా కలవగా, అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ఏఎస్పీలు సుప్రజ (పరిపాలన), ఆరీఫుల్లా (శాంతి భద్రతలు), వెస్ట్, ఈస్ట్ డీఎస్పీలు నరసప్ప, మురళీకృష్ణ, సీఐలు పాల్గొన్నారు.