ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి: ఆర్డీవో
ABN , First Publish Date - 2021-05-06T06:19:50+05:30 IST
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని ఆర్డీవో పి.సింధు సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు. బుధవారం చోడవరంలో రైతు భరోసా కేంద్రాన్ని ఆమె పరిశీలించారు.
ద్రాక్షారామ, మే 5: ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని ఆర్డీవో పి.సింధు సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు. బుధవారం చోడవరంలో రైతు భరోసా కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఇప్పటివరకు ఎంతమేర ధాన్యం కొనుగోలు చేశారని అడిగి తెలుసుకున్నారు. కియోస్క్, ధాన్యం తేమ నిర్ధారణ యంత్రం పనితీరును పరిశీలించారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ర్టేషన్ చేయించుకుని ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర పొందాలని కోరారు. రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు కూపన్లు అందజేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ పి.తేజేశ్వరావు, మండల వ్యవసాయాధికారి టీవీఆర్ మణిదీప్, ఆర్ఐ నాయుడు, వ్యవసాయ సహాయకురాలు దుర్గ రైతులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లల్లో ఇబ్బందులు సృష్టిస్తే చర్యలు
కాజులూరు(కరప), మే 5: రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లల్లో దళారులు, రైస్మిల్లర్లు ఇబ్బందులు సృష్టిస్తే వారిపై చర్యలు తప్పవని రామచంద్రపురం ఆర్డీవో పి.సింధుసుబ్రహ్మణ్యంహెచ్చరించారు. ఆర్యవటం గ్రామంలో బుధవారం ఆమె ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం విక్రయాల్లో ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతులు భూముల వివరాలు తెలిపి, కూపన్లు పొందాలని, వాటి ద్వారా రైస్మిల్లర్లకు ధాన్యం అమ్మితే మద్దతు ధర లభిస్తుందన్నారు. తహశీల్దార్ సత్యనారాయణ, ఏవో మురళీధర్, ఆర్ఐ లోవరాజు, వైసీపీ నాయకుడు వనుం వెంకటసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.