Punjab RPG Attack : ఖలిస్థాన్-పాక్ ఐఎస్ఐ లింక్ వెల్లడి
ABN , First Publish Date - 2022-05-13T23:43:52+05:30 IST
పంజాబ్లోని మొహాలీలో సోమవారం జరిగిన రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్
చండీగఢ్ : పంజాబ్లోని మొహాలీలో సోమవారం జరిగిన రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (RPG) దాడి కేసులో పోలీసులు శుక్రవారం ఆరుగురిని అరెస్టు చేశారు. పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్క్వార్టర్స్పై జరిగిన ఈ దాడి వెనుక పాకిస్థానీ (Pakistani) నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) హస్తం ఉన్నట్లు వెల్లడైంది. ఐఎస్ఐ ఆదేశాలతో ఖలిస్థానీ (Khalistani) ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ), స్థానిక గ్యాంగ్స్టర్స్ ఈ దాడికి పాల్పడినట్లు బయటపడింది.
పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) వీకే భవ్రా శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, కెనడా (Canada) నివాసి లక్బిర్ సింగ్ లండా ఈ దాడికి ప్రధాన సూత్రధారి అని తెలిపారు. పాకిస్థాన్లోని ఖలిస్థాన్ ఉగ్రవాది హర్వీందర్ సింగ్ రిండాకు లక్బిర్ సన్నిహిత సహచరుడని తెలిపారు.
తరన్ తరన్లో ఉంటున్న నిషాన్ సింగ్, చాదత్ సింగ్లతో కలిసి లండా ఈ RPG దాడికి పాల్పడినట్లు పంజాబ్ (Punjab) పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడినవారికి, వారికి సహాయపడినవారికి నిధాస్ సింగ్ తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చినట్లు చెప్పారు. లండా చెప్పిన చోటు నుంచి నిషాన్ సింగ్ RPGని తీసుకుని, దాడికి పాల్పడినవారికి అందజేశాడన్నారు. తరన్ తరన్లో ఉంటున్న బల్జిందర్ సింగ్ రాంబో ఏకే-47 రైఫిల్ను తీసుకుని, చాదత్ సింగ్కు అందజేశాడన్నారు.
చాదత్ సింగ్, మరో ఇద్దరితో కలిసి తరన్ తరన్ నుంచి మే 7న బయల్దేరి వెళ్ళాడని, రెండు రోజుల అనంతరం (మే 9న) మొహాలీలోని పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్క్వార్టర్స్పై దాడి చేశారని చెప్పారు. వీరందరికీ మొహాలీలో ఉంటున్న జగదీప్ సింగ్ సహకరించాడని తెలిపారు. చాదత్ సింగ్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. నోయిడాలో నివసిస్తున్న, బిహార్కు చెందిన మహమ్మద్ అసీం ఆలం, మహమ్మద్ సరఫ్రాజ్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.