కెప్టెన్ అమరీందర్ నామినేషన్..మాదే ప్రభుత్వమన్న కేంద్ర మంత్రి
ABN , First Publish Date - 2022-01-31T19:29:27+05:30 IST
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) వ్యవస్థాపకుడు...
పాటియాలా: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) వ్యవస్థాపకుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ సోమవారంనాడు నామినేషన్ వేశారు. పాటియాలాలో ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాన్ని అందజేశారు. పాటియాలా నియోజకవర్గం నుంచి కెప్టెన్ అమరీందర్ పోటీ చేస్తున్నారు. కెప్టెన్ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ ఎస్.షెకావత్, పలువురు నేతలు హాజరయ్యారు. పంజాబ్లో బీజేపీ-పంజాబ్ లోక్ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి.
చరిత్ర సృష్టిస్తాం...
కెప్టెన్ అమరీందర్ సింగ్ నామినేషన్ అనంతరం మీడియాతో గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, బీజేపీ-పీఎల్సీ కూటమి పాటియాలాతో సహా 117 సీట్లలోనూ చరిత్ర సృష్టిస్తుందని చెప్పారు. పంజాబ్ ప్రజలకు రాష్ట్ర భద్రత, దేశ భద్రత చాలా ముఖ్యమని, అదే లక్ష్యంతో తమ కూటమి పోటీ చేస్తోందని చెప్పారు. తప్పనిసరిగా తమ కూటమి పంజాబ్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.