మోదీ పర్యటనలో భద్రతా లోపాలపై అత్యున్నత స్థాయి దర్యాప్తు కమిటీ ఏర్పాటు

ABN , First Publish Date - 2022-01-06T17:36:05+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో

మోదీ పర్యటనలో భద్రతా లోపాలపై అత్యున్నత స్థాయి దర్యాప్తు కమిటీ ఏర్పాటు

చండీగఢ్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై దర్యాప్తు చేసేందుకు అత్యున్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఏర్పాటు చేసింది. మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఈ కమిటీని ఆదేశించింది. జస్టిస్ (రిటైర్డ్) మెహతాబ్ సింగ్ గిల్, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోం అఫైర్స్) అండ్ జస్టిస్ అనురాగ్ వర్మలతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. 


పంజాబ్ శాసన సభకు త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో పాల్గొనవలసిన తొలి బహిరంగ సభ రద్దయింది. ఫిరోజ్‌పూర్‌లో బుధవారం ఈ సభ జరగవలసి ఉండగా, ప్రధాన మంత్రి భద్రత విషయంలో తీవ్ర లోపం ఉందని, అందువల్లే ఈ సభ రద్దయిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. 


కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ వార్తా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉదయం భటిండా చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్లో హుస్సేనీవాలాలోని జాతీయ అమరవీరుల స్మారక కేంద్రానికి వెళ్ళవలసి ఉంది. వర్షం కురుస్తుండటం, దారి కనిపించకపోవడం వల్ల ఆయన దాదాపు 20 నిమిషాలపాటు వేచి చూశారు. వాతావరణం సానుకూలంగా మారకపోవడంతో, రోడ్డు మార్గంలో ప్రయాణించి, అమరవీరుల స్మారక కేంద్రానికి చేరుకోవాలని నిర్ణయించారు. రోడ్డు మార్గంలో వెళ్తే రెండు గంటలకు పైగా సమయం అవసరమవుతుంది. పంజాబ్ డీజీపీ నుంచి భద్రతా సంబంధిత ధ్రువీకరణ పొందిన తర్వాత రోడ్డు మార్గంలో ప్రయాణం ప్రారంభించారు. అయితే జాతీయ అమరవీరుల స్మారక కేంద్రానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో, ఫ్లైఓవర్ వద్దకు మోదీ కాన్వాయ్ చేరుకునేసరికి, కొందరు నిరసనకారులు ఆ రోడ్డును దిగ్బంధనం చేసినట్లు తెలిసింది. ఆ ఫ్లైఓవర్‌పై మోదీ దాదాపు 20 నిమిషాలపాటు చిక్కుకున్నారు. ఇది ప్రధాన మంత్రి భద్రత విషయంలో అత్యంత ప్రధాన లోపం. 


భద్రతా లోపం కనిపించడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం పంజాబ్‌లో పాల్గొనవలసిన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. తక్షణమే ఈ అంశంపై నివేదికను సమర్పించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పంజాబ్ ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ, ప్రధాన మంత్రి పర్యటనలో ఇటువంటి నిర్లక్ష్యం ఆమోదయోగ్యం కాదని, జవాబుదారీతనాన్ని నిర్ణయించాలని చెప్పారు. 


కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, మోదీని కాంగ్రెస్ ద్వేషిస్తుందని అందరికీ తెలుసునన్నారు. భారత దేశ ప్రధాన మంత్రికి హాని చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నించిందని ఆరోపించారు. 


Updated Date - 2022-01-06T17:36:05+05:30 IST