అకాలీనేతలకు మాట్లాడే హక్కు లేదు: కెప్టెన్ అమరీందర్

ABN , First Publish Date - 2021-09-16T01:58:33+05:30 IST

సాగు చట్టాల కారణంగా ఏర్పడిన సంక్షోభానికి సంబంధించి కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్‌పై..

అకాలీనేతలకు మాట్లాడే హక్కు లేదు: కెప్టెన్ అమరీందర్

ఛండీగఢ్: సాగు చట్టాల కారణంగా ఏర్పడిన సంక్షోభానికి సంబంధించి కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్‌పై కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారంనాడు విరుచుకుపడ్డారు. ముఖ్యంగా హర్‌సిమ్రత్ బాదల్ సహా ఏ ఒక్క అకాలీ నేతకు కూడా దీనిపై మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ సాగు చట్టాల వల్ల తలెత్తే సంక్షోభాన్ని సులభంగా నివారించే వీలున్నప్పటికీ ఆ పని చేయలేదని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఒక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాల్లోనూ వాళ్లు (అకాలీదల్) పాలుపంచుకున్నారని విమర్శించారు.


రైతుల సుదీర్ఘ ఆందోళన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడుతుందంటూ తాను చేసిన వ్యాఖ్యలపై హర్‌సిమ్రత్ కౌర్ చేసిన ఆరోపణలకు ముఖ్యమంత్రి దీటుగా సమాధానమిచ్చారు. రాజీకీయ ఉద్దేశాలతో ఏవేవో మాట్లాడుతున్నారని, ఉద్దేశపూర్వకంగా సంక్షోభం సృష్టించి, దానిని నివారించేందుకు వీలు ఉన్నప్పటికీ పట్టించుకోలేదని, ఆమె, ఆమె పార్టీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని సీఎం తప్పుపట్టారు. బీజేపీ నాయకత్వం, మోదీ  భాషలో కెప్టెన్ మాట్లాడుతున్నారంటూ హర్‌సిమ్రత్ కౌర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన కొట్టివేశారు. రైతులను తాను ఢిల్లీ వెళ్లమని ఎప్పుడూ చెప్పలేదని, తప్పనిసరి పరిస్థితుల్లోనే వారంతా ఇళ్లు విడిచి, ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయింపు నిరసనలకు దిగారని, కేంద్రంలోని అకాలీదళ్‌తో కూడిన సంకీర్ణ ప్రభుత్వ తప్పిదాలే ఇందుకు కారణమని అన్నారు.

Updated Date - 2021-09-16T01:58:33+05:30 IST