దారి తప్పుతున్న కుమారుడికి బజారులో శిక్ష

ABN , First Publish Date - 2022-04-05T02:41:35+05:30 IST

దారి తప్పుతున్న కుమారుడిని బజారులో శిక్ష వేసింది ఆ తల్లి. వద్దురా కన్నా... గంజాయి మానుకో అని బతిమిలాడినా

దారి తప్పుతున్న కుమారుడికి బజారులో శిక్ష

కోదాడ: దారి తప్పుతున్న కుమారుడిని బజారులో శిక్ష వేసింది ఆ తల్లి. వద్దురా కన్నా... గంజాయి మానుకో అని బతిమిలాడినా, మార్పు రాని కుమారుడిని ఇక మాటలతో కాదు, చేతల్లో చూపించాలని భావించింది. అంతే స్తంభానికి కట్టేసి, కంట్లో కారం చల్లి బుద్ధి చెప్పేందుకు ప్రయత్నించింది. గంజాయికి అలవాటు పడ్డ పిల్లలకు ఓ గుణపాఠంలా చేసింది. కోదాడ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థి గంజాయి పీల్చేందుకు అలవాటుపడ్డాడు. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా, కుమారుడు ఏడాదిగా గంజాయి పీల్చేందుకు అలవాటుపడ్డాడు. గంజాయి మత్తుతో ఇంటికి వస్తున్న కుమారుడిని గమనించిన తల్లిదండ్రులు పలుమార్లు మందలించారు. అయినా బాలుడిలో మార్పు రాలేదు.


గంజాయి మత్తులో ఇంటికి వచ్చిన కుమారుడిని చూసి ఆగ్రహంతో వీధిలో ఉన్న కరెంటు స్తంభానికి కట్టేసింది. కంట్లో, ముఖంపై కారం చల్లి బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది.  కంట్లో కారంతో మంటలకు బాలుడు అరిచి, తప్పు చేయనని వేడుకున్నాడు. తల్లి మనస్సు తల్లడిల్లుతున్నా ఓ కంట కన్నీరు పెడుతూనే కుమారుడిలో మార్పు రావాలని ఓపిక పట్టింది. సుమారు 15నిమిషాల అనంతరం స్థానికులు పిల్లవాడిని స్తంభం నుంచి విడిపించారు. కుమారుడిని కాపాడుకోవటానికి తాను చేసిన పని తప్పు కాదని తల్లి తెలిపింది. గంజాయి వంటి మత్తు పదార్థాల నుంచి పిల్లలను దూరం చేసేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని తల్లి వేడుకుంది.

Updated Date - 2022-04-05T02:41:35+05:30 IST