పేద కుటుంబానికి చెందిన ఆ యువకుడి వద్ద ఖరీదైన బైక్, మొబైల్.. చివరకు అసలు విషయం బయటపడడంతో మూడేళ్ల జైలు!
ABN , First Publish Date - 2022-02-10T18:25:32+05:30 IST
అతను ఓ పేద కుటుంబానికి చెందిన యువకుడు.. చదువు లేకపోవడంతో జులాయిగా తిరుగుతుంటాడు..
అతను ఓ పేద కుటుంబానికి చెందిన యువకుడు.. చదువు లేకపోవడంతో జులాయిగా తిరుగుతుంటాడు.. మూడు నెలల క్రితం అతనికి ఉన్నట్టుండి డబ్బులు వచ్చాయి.. ఖరీదైన బైక్, మొబైల్ కొని స్నేహితులకు పార్టీలు ఇవ్వడం ప్రారంభించాడు.. అయితే అసలు విషయం బయటపడడంతో పోలీసుల చేతికి చిక్కి మూడేళ్ల జైలు శిక్షకు గురయ్యాడు.
ఛత్తీస్గఢ్లోని బిలాయ్కు సమీపంలోని నయపార గ్రామానికి చెందిన శుభమ్ అనే యువకుడు కొన్ని రోజుల కిందట తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికకు సంబంధించిన అసభ్యకర ఫొటో సంపాదించాడు. దానిని చూపించి ఆ బాలికను, ఆమె కుటుంబాన్ని బెదిరించాడు. ఆ ఫొటోను నెట్లో పెట్టకూడదనుకుంటే తను అడిగినంత డబ్బు ఇవ్వాలని బాలిక కుటుంబ సభ్యులను బెదిరించాడు. కుటుంబం పరువు పోతుందనే భయంతో వారు ఆ యువకుడు చెప్పినట్టే చేశారు.
డబ్బులు, బంగారు నగలు కలిపి మొత్తం రూ.7 లక్షల వరకు శుభమ్కు ముట్టజెప్పారు. అయినా శుభమ్ కనికరించలేదు. ఇంకా డబ్బులు కావాలని అడిగాడు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ కేసుపై విచారణ జరిపిన కోర్టు నిందితుడికి రూ.4 వేల జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష విధించింది.