రుయా ఘటనలో బాధ్యులను శిక్షించండి
ABN , First Publish Date - 2021-05-15T06:13:05+05:30 IST
నిర్లక్ష్యంగా వ్యవహరించి 11 మంది కొవిడ్ బాధితుల మరణానికి కారణమైన రుయాస్పత్రి అధికారులను కఠినంగా శిక్షించాలని టీడీపీ నాయకులు డిమాండు చేశారు.
అర్బన్ పోలీసులకు టీడీపీ నాయకుల ఫిర్యాదు
తిరుపతి(నేరవిభాగం), మే 14: నిర్లక్ష్యంగా వ్యవహరించి 11 మంది కొవిడ్ బాధితుల మరణానికి కారణమైన రుయాస్పత్రి అధికారులను కఠినంగా శిక్షించాలని టీడీపీ నాయకులు డిమాండు చేశారు. ఈ మేరకు శుక్రవారం తిరుపతిలోని అర్బన్ ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయానికి ఎస్పీ వెంకటఅప్పలనాయుడు లేకపోవడంతో డీఎస్పీ సూర్యనారాయణ (ఎస్సీ, ఎస్టీ సెల్)కు ఫిర్యాదులు అందజేశారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్, తెలుగు యువత అధ్యక్షుడు రవినాయుడు డీస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. రుయా అధికారులు నిర్లక్ష్యం కారణంగానే 11 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. బాధ్యులపై కేసులు నమోదు చేయాలని కోరారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఎప్పటికప్పుడు ఆక్సిజన్ నిల్వలను సరిచూసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. రుయా అధికారులు విధుల్లో చూపిన అలసత్వం వల్ల 11 నిండు ప్రాణాలు బలైపోయాయని, ఆయా కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై ఖఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.