నా దగ్గర Pens కొనండి.... బిచ్చమెత్తడం నాకిష్టం లేదు

ABN , First Publish Date - 2021-10-17T02:38:31+05:30 IST

రీఅప్ స్టూడియో అనే వినూత్న బ్రాండ్ వ్యవస్థాపకురాలు శిఖా రథి సోషల్ మీడియాలో పంచుకున్న ఓ పోస్టు ఇప్పుడు అందరి

నా దగ్గర Pens కొనండి.... బిచ్చమెత్తడం నాకిష్టం లేదు

పూణె: రీఅప్ స్టూడియో అనే వినూత్న బ్రాండ్ వ్యవస్థాపకురాలు శిఖా రథి సోషల్ మీడియాలో పంచుకున్న ఓ పోస్టు ఇప్పుడు అందరి హృదయాలను తడిమేస్తోంది. పూణెలోని ఎంజీ రోడ్డుకు తన స్నేహితులతో కలిసి వెళ్లిన ఆమెను రతన్ అనే పండు ముసలి స్త్రీ ఆకర్షించింది. ఆమె రంగురంగుల పెన్నులు విక్రయిస్తోంది. పెన్నులన్నీ ఓ కార్డుబోర్డులో వేసి ఉన్నాయి. అందులో ఏం విశేషం లేదు కానీ, ఆ బాక్స్‌పైన రాసి ఉన్నదే రథిని విశేషంగా ఆకర్షించింది. ఆ బాక్స్‌పై ‘‘నేను యాచించాలనుకోవడం లేదు. దయచేసి ఈ బ్లూ కలర్ పెన్నులను రూ. 10కు కొనుగోలు చేయండి. ధన్యవాదాలు, బ్లెస్ యూ’’ అని రాసి ఉంది. 


ఆ పోస్టు చూసిన ఆమె కళ్లు అప్రయత్నంగా తడిబారాయి. రతన్ కథను తన స్నేహితులతో పంచుకోలేకుండా ఉండలేకపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రతన్ ఫొటోను పోస్టు చేసిన ఆమె.. ‘‘ఈ రోజు నేను నిజ జీవిత హీరో, ఛాంపియన్ రతన్‌ను కలిశాను. ఫ్రెండ్‌తో బయటకు వెళ్లినప్పుడు ఎంజీ రోడ్డులో నేనామెను కలిశాను. ఆమె అట్టపెట్టెపై ఉన్న నోట్ చదివిన వెంటనే నా ఫ్రెండ్ వెంటనే పెన్నులు కొనేశాడు. దీంతో రతన్ ఎంతో సంతోషించింది. ఆమె కళ్లలోని కృతజ్ఞత, కరుణను మేం చూడగలిగాం’’ అని రాసుకొచ్చారు. 


మరిన్ని పెన్నులు కొనుగోలు  చేయాలని రతన్ తమను ఒప్పించలేదని, ఒక్క పెన్నుతో సరిపెట్టుకున్నా సరే అందని పేర్కొన్నారు. అయితే, తాము మాత్రం మరిన్ని పెన్నులు కొనుగోలు చేశామని, ఆమె చిరునవ్వు, కృతజ్ఞతను చూసినప్పుడు తన హృదయం నిండిపోయిందని, ఇది అందరితో పంచుకోవడానికి అర్హమైన పోస్టు అని క్యాప్షన్ తగిలించారు. అంతేకాదు, రతన్ వద్ద పెన్నులు కొనుగోలు చేయాలని తన ఫాలోవర్లకు సూచించారు. 


రథి చేసిన పోస్టుకు విపరీతమైన స్పందన వచ్చింది. చాలామంది వెంటనే ఎంజీ రోడ్డు వెళ్లి రతన్‌ను కలవాలని ఉందంటూ ఉత్సాహం చూపించారు. తాను ఆమె ముఖంలోని నవ్వును చూడడానికి ఎంజీ రోడ్‌కు వెళ్తానంటూ మరో యూజర్ రాసుకొచ్చాడు. మరికొందరు తాము డబ్బులు పంపిస్తామని, పెన్నులు కొనుగోలు చేయాలని రథిని కోరారు.  

Updated Date - 2021-10-17T02:38:31+05:30 IST