పుణే నగర పాలక సంస్థ ఉద్యోగులకు రూ.1 కోటి జీవిత బీమా
ABN , First Publish Date - 2020-04-11T02:02:21+05:30 IST
మహారాష్ట్రలోని పుణే నగర పాలక సంస్థ తన ఉద్యోగులకు గట్టి భరోసా ఇచ్చింది
ముంబై : మహారాష్ట్రలోని పుణే నగర పాలక సంస్థ తన ఉద్యోగులకు గట్టి భరోసా ఇచ్చింది. కోవిడ్-19 వ్యాప్తి నిరోధక చర్యల్లో పాల్గొనే ఉద్యోగులు ఆ వ్యాధి కారణంగా మరణించినట్లయితే, వారి కుటుంబ సభ్యులకు రూ.1 కోటి ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించింది.
పుణే నగర మేయర్ ముళీధర్ మొహోల్ శుక్రవారం మాట్లాడుతూ కరోనా వైరస్ మహమ్మారిని నిరోధించేందుకు పుణే నగర పాలక సంస్థకు చెందిన అనేక శాఖలవారు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. వారికి తప్పనిసరిగా భద్రత ఉండాలని తాము భావించామన్నారు. ఒకవేళ ఈ వ్యాధి కారణంగా ఎవరైనా మరణించినట్లయితే, వారి కుటుంబ సభ్యులకు రూ.1 కోటి ఆర్థిక సాయం పుణే నగర పాలక సంస్థ ఇస్తుందన్నారు. మృతుల కుటుంబ సభ్యులు ఎవరైనా నగర పాలక సంస్థలో పని చేయాలనుకుంటే, ఒకరికి ఉద్యోగం ఇస్తామని తెలిపారు. ఈ విధంగా కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చేటపుడు, ఆ కుటుంబానికి రూ.75 లక్షలు మాత్రమే ఇస్తామన్నారు.