అతను నడిచే ప్లాజ్మా బ్యాంకు... ఎన్నిసార్లు దానమిచ్చాడంటే....
ABN , First Publish Date - 2021-05-10T13:26:40+05:30 IST
దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తోంది.
పూణె: దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ కారణంగా లక్షలాది మంది ప్రజల జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఇటువంటి సమయంలో కొందరు కరోనా బాధితులను ఆదుకుంటున్నారు. పూణేకు చెందిన ఒక దాత ప్లాస్మాను దానం చేయడం ద్వారా పలువురికి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. ఏకంగా 14 సార్లు ప్లాస్మాను దానం చేసిన రికార్డును అతని సొంతమయ్యింది. మహారాష్ట్రలోని పూణేకు చెందిన 50 ఏళ్ల అజయ్ మునోట్ ఇప్పటివరకు 14 సార్లు ప్లాస్మాను దానం చేశారు.
శరీరంలో నిరంతరం తయారవుతున్న ప్రతిరోధకాలను దానం చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలను కాపాడాలని అజయ్ నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా అజయ్ మునోట్ మాట్లాడుతూ తాను 2020, జూలైలో కరోనా బారిన పడ్డానని, అప్పటి నుండి తరచూ ప్లాస్మాను దానం చేస్తున్నానని తెలిపారు. గడచిన తొమ్మిది నెలల్లో తాను 14 సార్లు ప్లాజ్మా దానం చేశానని తెలిపారు. తాను వీలైనంతకాలం ఇలా ప్లాస్మాను దానం చేస్తుంటానని తెలిపారు. సాధారణంగా ఆరోగ్యవంతమైన మనిషి తన ప్లాస్మాను 14 రోజుల వ్యవధిలో దానం చేయవచ్చని తెలిపారు.