Pulwama Encounter: ఇద్దరు జైషే ఉగ్రవాదుల హతం
ABN , First Publish Date - 2022-05-30T14:04:54+05:30 IST
జమ్మూకశ్మీరులోని పుల్వామా జిల్లా గుండిపొరా గ్రామంలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో..
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని పుల్వామా (Pulwama) జిల్లాలో ఎన్కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జైషే మహమ్మద్ (Jaish-e-mohammad) ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామాలోని గుండిపురలో ఉగ్రవాదాల జాడ తెలుసుకునేందుకు ఆదివారం రాత్రి నుంచి ఆ ప్రాంతాన్ని బలగాలు తమ అధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ఇద్దరు జైషే ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలి నుంచి రెండు ఏకే రైఫిల్స్, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో హతమైన ఇద్దరు జైషే ఉగ్రవాదుల్లో ఒకరు ఈనెల 13న కానిస్టేబుల్ రెయాజ్ అహ్మద్ను పొట్టనపెట్టుకున్నట్టు కశ్మీర్ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు.
కాగా, ఈ ఏడాది జరిగిన కాల్పుల్లో 54వ ఎన్కౌంటర్ అని, 53 ఎదురుకాల్పుల్లో 26 మంది పాకిస్థానీలతోపాటు 84 మంది ఉగ్రవాదులు హతం అయ్యారని విజయ్ కుమార్ చెప్పారు.ఈ ఏడాది కాశ్మీర్లో 14 మంది పౌరులు, 16 మంది భద్రతా సిబ్బంది కూడా ఉగ్రవాద ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు.