పప్పు దినుసుల సాగేది

ABN , First Publish Date - 2022-05-24T05:05:12+05:30 IST

జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహారోత్పత్తి పెరగ డం లేదు. మాంసాహారంతో సమానంగా పోషకాలను అందించే పప్పు దినుసుల సాగు గణనీయంగా తగ్గింది.

పప్పు దినుసుల సాగేది
కంది పంట

- భారీగా తగ్గిన అపరాల సాగు విస్తీర్ణం

- ఆహారభద్రతకు ముప్పు

- ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు

- జిల్లాలో యాసంగిలో సాగైంది  2940  ఎకరాలే

- పట్టించుకోని ప్రభుత్వం


నెన్నెల, మే 23: జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహారోత్పత్తి పెరగ డం లేదు. మాంసాహారంతో సమానంగా పోషకాలను అందించే పప్పు దినుసుల సాగు గణనీయంగా తగ్గింది. జిల్లాలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తిలో పప్పుదినుసుల శాతం చాలా తక్కువగా ఉంది.  వాణిజ్యపంటలు సంప్రదాయ సాగును వెనక్కు నెట్టేస్తున్నాయి. చాలా ఏళ్లు స్థిరంగా ఉన్న పప్పుదినుసుల దిగుబడులు కొన్నేళ్లుగా క్షిణిస్తూ వస్తున్నాయి. యాసంగిలో జిల్లాలో 74,664 ఎకరాల్లో సాగు కాగా పప్పుదినుసులు 2940 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు.పప్పు దినుసుల సాగు కనిష్ట స్థాయికి పడిపోవడం తో ఆహారభద్రతపై ప్రభావం చూపుతుందని నిఫుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సీజన్‌ లో అపరాల సాగు విస్తీర్ణం పెంచేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది.

జిల్లాలో యాసంగిలో సాగైన పప్పు దినుసుల పంటల వివరాలు

మినుములు: 879 ఎకరాలు

పెసలు: 1506 ఎకరాలు

కందులు 219 ఎకరాలు

శనగలు 336

మొత్తం 2940 ఎకరాలు

- గణనీయంగా తగ్గిన సాగు విస్తీర్ణం

పప్పు దినుసుల సాగులో గతంలో రాష్ట్రంలోనే జిల్లా అగ్రభాగాన ఉండేది. పదేళ్ల కిందట దాదాపు 40 వేల ఎకరాల్లో సాగయ్యే పప్పుదినుసుల సాగు ప్రస్తుతం మూడు వేల ఎకరాలకు పడిపోయింది. ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతాల్లో సాగైన పప్పుదినుసుల పంట క్రమంగా తగ్గుతూ వచ్చింది. పత్తి, మిరప, పొద్దు తిరుగుడు తదితర వాణిజ్య పంటల వైపు రైతులు మొగ్గుచూపారు. జిల్లాలో కంది, శనగ, పెసర, మినుము వంటి పప్పు దినుసులు గతంలో విరివిగా పండించే వారు. జనాభాతో పోల్చితే పండిస్తోంది అతి తక్కువ. అవసరానికి సరిపడ ఉత్పత్తి లేకపోవడంతో పప్పు దినుసులను దిగుమతి చేసుకోక తప్పడం లేదు. కంది మినహా మినుము, పెసర, శనగ లాంటి పప్పు దినుసుల సాగు సమయం తక్కువే. పెట్టుబడులు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. వాణిజ్య పంటలతో పోల్చుకుంటే రైతులకు లాభాలు తక్కువగా వస్తుండటంతో పప్పు దినుసుల సాగుపై మొగ్గు చూపడం లేదు.  యేటా జిల్లాలో పప్పు దినుసుల ఉత్పత్తి తగ్గి పోతుండటంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

-పట్టించుకోని ప్రభుత్వం

పప్పుదినుసులు పండించడంలో ఉన్న ఇబ్బందులతో రైతులు సాగుకు  మొగ్గు చూపడం లేదు.  మార్కెట్‌ పరంగా పంటకు ప్రోత్సాహకాలు అంది స్తేనే పప్పుదినుసుల సాగు పెరుగుతుందని నిపుణులంటున్నారు. ఆహార భద్రత కోసం తీసుకు వచ్చిన హరిత విప్లవం కూడా వ్యవసాయ విధానంలో భాగమైన పప్పుదినుసులను దూరం చేసింది. భారీ ప్రాజెక్టులు, చెరువులతో నీరు సమృద్ధిగా ఉండి భూములన్ని వరి పంటకు మారిపోయాయి. పప్పు దినుసులకు ప్రాముఖ్యత లేకుండా పోతోంది. పరిశోధన, సాంకేతిక విషయాల్లో ప్రోత్సాహం  కనిపించడం లేదు. అపరాల్లో సైతం జీవవైవిధ్యం తగ్గిపోతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కనీసం 30 శాతం వృద్ధి పెంచడానికి  అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదనే ఆరోపణలున్నాయి. కేవలం పది శాతమే అధికారిక ఆమోదం పొందిన విత్తనాలు వాడుతున్నారు. విత్తన సంస్థలు పప్పు దినుసుల హైబ్రీడ్‌ రకాలను ఉత్పత్తి చేయడం లేదు. కందికి మాత్రమే హైబ్రీడ్‌ రకాలున్నాయి. సర్కారు పప్పు దినుసుల ఉత్పత్తిని పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. 20 ఏళ్లుగా హెక్టారుకు ఆరు క్వింటాళ్ల సగటు దిగుబడి మాత్రమే వస్తోంది. పప్పుదినుసులకు మార్కెట్‌ నుంచి సరైన రక్షణ లేదు. రిటైల్‌ మార్కెట్లో ఉన్న ధరకు హోల్‌సేల్‌ మార్కెట్లో ఉన్న ధరలకు వ్యత్యాసం పొంతన లేకుండా ఉంటోంది.  

తీసుకోవల్సిన జాగ్రత్తలు

- వరి,  పత్తి పంటలకు ఇచ్చిన ప్రాధాన్యం పప్పుదినుసుల సాగుకు ఇవ్వాలి.

- కొనుగోళ్ల పర్యవేక్షణకు ఉన్నతస్థాయి కమిటీని నియమించాలి

- పప్పుదినుసుల సాగులో అధిక దిగుబడలు సాధించే వంగడాలను అభివృద్ధి చేయాలి.

- దిగుబడులను పెంచడం సహా స్వల్పకాలిక రకాలను రూపొందించడంపై దృష్టి సారించాలి.

- ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటనతోనే ఆగిపోకూడదు. వరి,  గోధుమల్లాగా భారత ఆహార సంస్థ వీటిని  సేకరించాలి.

- నాణ్యమైన  విత్తనాలు సరఫరా చేయాలి. 

- వర్షాధార వరి సాగు చేసే ప్రాంతాల్లో పప్పుదినుసులను ప్రోత్సహించాలి.

- పత్తిలో అంతర పంటగా సాగు చేసేలా చూడాలి.


నాడు పుట్ల కొద్ది పండేటివి

కాల్వ బీరయ్య, రైతు నందులపల్లి, నెన్నెల మండలం

కందులు, పెసలు, శనగలు గతంలో పుట్ల కొద్ది  పండేటివి. ఇప్పుడు తిందామంటే దొరుకుత లేవు. చెరువులు, కుంటల శిఖాల్లో ఊరంత ఒకటై శనగలు వేసేటోల్లు. అట్ల పప్పు దినుసులు పండించే కాలం పోయింది. అందరు పత్తి పంటకు ఎగబడ్డరు. ఏడ చూసిన పత్తే కనిపిస్తున్నది. ఇంటి పెరళ్లల్లో కూడా పత్తి పెడుతున్నరు. పైసల కోసం పండించే పంటలు ఎప్పటికి మంచిది కాదు.

Updated Date - 2022-05-24T05:05:12+05:30 IST