ప్రభుత్వరంగ సంస్థలను పరిరక్షించాలి
ABN , First Publish Date - 2022-01-26T06:07:19+05:30 IST
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖ ఉక్కుకు సముచిత స్థానముందని, ఉక్కు కర్మాగారంపై జరుగుతున్న దాడిని ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని సీఐటీయూ నాయకుడు కేఎం శ్రీనివాస్ అన్నారు.
సీఐటీయూ నాయకుడు కేఎం శ్రీనివాస్
కూర్మన్నపాలెం, జనవరి 25: ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖ ఉక్కుకు సముచిత స్థానముందని, ఉక్కు కర్మాగారంపై జరుగుతున్న దాడిని ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని సీఐటీయూ నాయకుడు కేఎం శ్రీనివాస్ అన్నారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 348వ రోజు కొనసాగాయి. మంగళవారం ఈ దీక్షలలో ఆర్ఎంహెచ్పీ కార్మికులు కూర్చున్నారు. ఈ శిబిరంలో శ్రీనివాస్ మాట్లాడుతూ ఉక్కు పరిరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు. పోరాట కమిటీ కో కన్వీనర్ గంధం వెంకటరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పరిరక్షణ పోరాట కమిటీ నేతలు అయోధ్యరామ్, మంత్రి రాజశేఖర్, బూసి వెంకటరావు, బొడ్డు పైడిరాజు, మస్తానప్ప, విళ్ల రామ్మోహన్ కుమార్, వరసాల శ్రీనివాసరావు, దొమ్మేటి అప్పారావు, ఎన్నేటి రమణ, ఎల్లాజీ, రాజు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.