ప్రభుత్వరంగ సంస్థలను పరిరక్షించాలి
ABN , First Publish Date - 2021-06-24T05:43:19+05:30 IST
ప్రభుత్వరంగ సంస్థ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి కార్మికుడిపై ఉందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ అన్నారు.
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ
కూర్మన్నపాలెం, జూన్ 23: ప్రభుత్వరంగ సంస్థ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి కార్మికుడిపై ఉందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ అన్నారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 132వ రోజు కొనసాగాయి. బుధవారం ఈ దీక్షలలో ఏఐటీయూసీ యూనియన్ కార్మికులు కూర్చున్నారు. ఈ శిబిరంలో పాల్గొన్న ఆదినారాయణ మాట్లాడుతూ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా దీక్షలలో పాల్గొన్న కార్మికులను అభినందించారు. కేంద్రంలో బీజేపికి బుద్ధి వచ్చేలా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లి మహోద్యమంగా మార్చాల్సిన అవసరముందన్నారు. విశాఖ ఉక్కు పోరాట కమిటీ కన్వీనర్ జె.అయోధ్యరామ్ మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టాలని కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా పావులు కదుపుతున్నదన్నారు. అలాంటి కేంద్ర ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలోకి కలిపే వరకు కార్మికులు తమ ఐక్య ఉద్యమాలను ఉదృతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు పోరాట కమిటీ సభ్యులు వై.శ్రీనివాస్, రాజబాబు, రామచంద్ర రాజు, సూర్య, దేముడు, గుప్త తదితరులు పాల్గొన్నారు.