ప్రపంచస్థాయి ప్రమాణాలతో ప్రభుత్వ పాఠశాలలు
ABN , First Publish Date - 2021-03-05T06:16:25+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలని, ఇందుకు అఽధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ అన్నారు.
రాష్ట్ర పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి రాజశేఖర్
అనంతగిరి, మార్చి4: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలని, ఇందుకు అఽధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ అన్నారు. గురువారం స్థానిక హరిత రిసార్ట్స్లో మన్యంలోని 11 మండలాల ఏటీడబ్ల్యూవోలు, ఇంజనీరింగు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మొదటివిడత నాడు-నేడు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లో పర్యటించి నాడు-నేడు పనులను పరిశీలిస్తున్నామని, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో పనులు చాలా బాగున్నాయన్నారు. అదేతరహాలో అన్ని పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ మార్చి 31 నాటికి పనులు పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ తరహాలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. రెండు, మూడు విడతల్లో 30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు పనులను చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, ఏప్రిల్ 1 నుంచి రెండవ విడత పనులు ప్రారంభిస్తామన్నారు. ఇంజనీరింగు అధికారుల పర్యవేక్షణ లోపాలు మన్యంలోని నాడు-నేడు పనుల్లో కనిపిస్తున్నదని, లోపాలను సరిదిద్ది మార్చి 31 నాటికి పనులు పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. పాఠశాల విద్య డైరెక్టర్ చినవీరభద్రుడు మాట్లాడుతూ.. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిర్వహణ విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్దండే ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ప్రత్యేక ప్రాజెక్టు అధికారిణి వెట్రిసెల్వి, ఇన్ఫ్రాస్టక్చర్ అడ్వయిజర్ మురళి, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ రాజేశ్వరరెడ్డి, ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్, ఆర్జేడీ కె.నాగేశ్వరరావు, డీఈఓ లింగేశ్వరరెడ్డి, సమగ్ర శిక్ష పీవో మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.
నాడు-నేడు పనుల పరిశీలన
సమీక్షా సమావేశానికి ముందు గురువారం ఉదయం కొత్తవలస బాలుర పాఠశాలలో నాడు-నేడు పనులను ముఖ్యకార ్యద ర్శులతో కూడిన అఽధికారుల బృందం పరిశీలించింది. మరుగుదొడ్ల నిర్వహణ, పెయింటింగ్ పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని సూచించారు. సమీక్ష సమావేశం అనంతరం గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే బాలికల-1 పాఠశాలను సందర్శించి నాడు-నేడు పనులను పరిశీలించారు. డ్యూయల్ డెస్క్లకు ఒకే రంగు వేయించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థినితో తెలుగు పాఠాలు చదివించి వారి విద్యాప్రమాణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్, డీడీ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.