క్వారీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ
ABN , First Publish Date - 2021-04-21T05:58:11+05:30 IST
పచ్చగా ఉండే పల్లెసీమల్లో గ్రానైట్ తవ్వకం చేపడితే పశువులతో పాటు ప్రజలకు కూడా అనారోగ్యాలు వస్తాయని జమ్మలమడక గ్రామస్థులు జాయింట్ కలెక్టర్ చేతన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు.
కనిగిరి, ఏప్రిల్ 20: పచ్చగా ఉండే పల్లెసీమల్లో గ్రానైట్ తవ్వకం చేపడితే పశువులతో పాటు ప్రజలకు కూడా అనారోగ్యాలు వస్తాయని జమ్మలమడక గ్రామస్థులు జాయింట్ కలెక్టర్ చేతన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలోని జమ్మలమడక గ్రామంలో స్టాన్లీ మైనింగ్ ప్రైవేటు కంపెనీ ద్వారా జరుగుతున్న క్వారీ ఏర్పాటుపై జిల్లా జాయింట్ కలెక్టర్ చేతన్ మంగళవారం గ్రామస్థులతో ముఖాముఖీ అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు పలు సమస్యలను జేసీ ఎదుట వెలిబుచ్చారు. క్వారీ ఏర్పాటు జరిగితే గ్రామంలో రోడ్లన్నీ పెద్ద పెద్ద లారీలతో, ఎక్సవేటర్లతో ఛిద్రమవుతాయన్నారు. అంతేకాకుండా తమ గ్రామానికి చెందిన పశువులతో పాటు ఇతర గ్రామాలకు చెందిన పశువులు కూడా క్వారీ ఏర్పాటు చేయబోయే సర్వే నెంబర్ 1/2, సర్వేనెంబర్ 2లో గ్రాసం కోసం వెళతాయన్నారు. గ్రామంలో పచ్చగా ఉండే చెట్లన్నీ కాలుష్యం బారిన పడతాయని జేసీకి వివరించారు. గ్రామస్థులు వ్యక్త పరిచిన సమస్యలు, ఇబ్బందులను జేసీ చేతన్ రికార్డు రూపంగా పొందుపరిచారు. కార్యక్రమంలో తహసీల్దార్ పుల్లారావు, ఆర్ఐ రమేష్, ఇన్చార్జ్ ఎంపీడీవో ఫ్రాన్సి్సబాబు, వీఆర్వో తిరుపతయ్య, జమ్మలమడక సర్పంచ్ పాశం కొండయ్య, పొల్యూషన్ కంట్రోలర్ ఈఈ నాగిరెడ్డి, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వీ.వంశీకృష్ణ, పర్యావరణ వేత్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. అదే విధంగా మాచవరం పీహెచ్సీలో ఫ్రంట్లైన్ వారియర్లకు జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్కార్యక్రమాన్ని పరిశీలించారు. పట్టణ సమీపంలోని కొత్తూరు గ్రామ సచివాలయంలో రికార్డులను పరిశీలించారు.