ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయం
ABN , First Publish Date - 2021-06-20T07:00:36+05:30 IST
ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి అన్నారు.
ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి
పట్టణంలో ఆనందయ్య మందు పంపిణీ
బారులు తీరిన ప్రజలు
కనిగిరి, జూన్19: ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ హైస్కూల్ శనివారం జరిగిన ఆనందయ్య మందు పంపిణీ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కరోనా మహమ్మారితో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ తరుణంలో కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్యులు ఆనందయ్య తయారు చేసిన మందు సత్ఫలితాలను ఇస్తోందన్నారు. ప్రభుత్వం మందును అన్ని విధాలా పరీక్షించి.., దుష్పరిణామాలు లేవని నిర్ధారించిన తర్వాతే మందును పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మొదటి నుంచితమ కుటుంబానికి కనిగిరి ప్రాంతంపై ఎంతో ఆదరాభిమానాలు ఉన్నాయన్నారు. ముందుగా పట్టణంలో తర్వాత గ్రామాల్లో పంపిణీ చేస్తామన్నారు. ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ ఎంపీ మాగుంట కుటుంబం కనిగిరి ప్రాంతం ప్రజలతో మమేకమై ఉందన్నారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించే వారి కుటుంబాన్ని కనిగిరి ప్రజలు ఆదరించాలన్నారు. తొలి విడతగా కనిగిరి పట్టణంలోని 20 వార్డుల్లో ప్రజలకు ఉచితంగా మందును పంపిణీ చేశామని చెప్పారు. అనతి కాలంలోనే 2వ విడత కూడా పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ మాగుంట తనయుడు రాఘవరెడ్డి, వైసీపీ నాయకులు రంగనాయకులరెడ్డి, నగర పంచాయతీ ఛైర్మన్షేక్ అబ్దుల్ గఫార్, జడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, ఎంపీపీ ప్రకాశం, కౌన్సిలర్లు రామనబోయిన శ్రీనివాసుల యాదవ్, దేవకి రాజీవ్, పసుపులేటి దీప, నాయకులు అరుణోదర్, సూరసాని మోహన్రెడ్డి, వేల్పుల వెంకటేశ్వర్లు యాదవ్, కో ఆప్షన్ చింతం శ్రీనివాసుల యాదవ్, కాసుల గురవయ్య యాదవ్, సంగు సుబ్బారెడ్డి, దాసరి మురళియాదవ్, తమ్మినేని సుజాత తదితరులు పాల్గొన్నారు.
మందు కోసం ఎగబడిన జనం
కనిగిరి పట్టణంలో 20 వార్డులల్లో సుమారు 15 వేల మంది జనాభా ఉన్నారు. ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ ఆఽధ్వర్యంలో ఎంపీ మాగుంట పంపిణీ చేసిన ఆనందయ్య మందుకు కొరత ఏర్పడింది. కేవలం వార్డు కౌన్సిలర్లకు 100 మాత్రమే ఇవ్వడంతో వారు ఆనందయ్య మందును ఎవరికి ఇవ్వాలో పాలుపోక ఇబ్బందులెదుర్కొన్నారు. టోకెన్లు ఇచ్చిన వారికే మందు పంపిణీ జరిగింది. అయితే టోకెన్లు కూడా సక్రమంగా ఏర్పాటు చేయకపోవడంతో ఒకానొక సందర్భంలో క్యూ లైన్లలో మందుకోసం ప్రజలు ఎగబడ్డారు.
సీ.ఎస్.పురంలో
సీఎ్సపురం : కరోనా నివారణకు కృష్ణపట్నం ఆనందయ్య మందును మండలంలోని అయ్యలూరివారిపల్లి సర్పంచ్ ముత్యాల భారతీరెడ్డి శనివారం ఉచితంగా పంపిణీ చేశారు. అయ్యలూరివారిపల్లి పంచాయితీలోని ప్రతి ఇంటికి పంపిణీ చేశారు. అలాగే సచివాలయ పరిధిలోని ఫ్రంట్లైన్ వర్కర్లకు, మండలంలో వివిధ పత్రికలలో పనిచేస్తున్న విలేకర్లకు ఆనందయ్య మందును పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు ముత్యాల నారాయణరెడ్డి, పంచాయతీ కార్యదర్శి అరవిందా పాల్గొన్నారు.