పబ్లిక్‌ పరీక్షలు ఉంటాయి

ABN , First Publish Date - 2021-12-29T13:57:59+05:30 IST

ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన పబ్లిక్‌ పరీక్షలు తప్పకుండా వుంటాయని, ఇందులో ఎలాంటి సందేహం లేదని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ స్పష్టం చేశారు. ఆ పబ్లిక్‌ ప

పబ్లిక్‌ పరీక్షలు ఉంటాయి

- ఏప్రిల్‌ లేదా మే నెలలో నిర్వహిస్తాం

- మంత్రి అన్బిల్‌ మహేష్‌


పెరంబూర్‌(చెన్నై): ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన పబ్లిక్‌ పరీక్షలు తప్పకుండా వుంటాయని, ఇందులో ఎలాంటి సందేహం లేదని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ స్పష్టం చేశారు. ఆ పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌ చివరి వారం, లేదా మే మొదటి వారంలో పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. స్థానిక సచివాలయంలో మంగళవారం జిల్లా ప్రధాన విద్యాధికారులతో మంత్రి అన్బిల్‌ మహేష్‌ సమావేశమయ్యారు సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాల జాబితా సిద్ధం చేస్తున్నామని, ఇప్పటివరకు 1,600 భవనాలను శిథిలావస్థకు చేరినట్టు గుర్తించామన్నారు. వాటిని తక్షణం కూల్చివేయాలని ఆదేశించామన్నారు. తమపై జరిగే లైంగిక వేధింపులపై విద్యార్థినులు ఫిర్యాదు చేసేలా ప్రతి పాఠశాలల్లో ప్రత్యేక పెట్టె ఏర్పాటుచేశామని, విద్యార్థులు 14417 అనే నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదులపై తగిన విచారణ జరిపి, బాధ్యులైన సిబ్బందిపై చర్యలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థులపై లైంగిక వేధింపులు అడ్డుకొనేలా ప్రతి పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ ఏడాది పబ్లిక్‌ పరీక్షలు తప్పకుండా నిర్వహిస్తామని, జనవరి మొదటి వారంలో రివిజన్‌ పరీక్షలు నిర్వహించి, ఏప్రిల్‌ చివరి వారం, మే మొదటి వారంలో పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు మంత్రి  తెలిపారు.


టెన్త్‌, ప్లస్‌ టూ విద్యార్థులకు రివిజన్‌ పరీక్షలు

టెన్త్‌, ప్లస్‌ టూ విద్యార్థులకు జనవరి, మార్చి నెలల్లో రివిజన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ విషయమై ప్రభుత్వ పరీక్షల విభాగం మంగళవారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. టెన్త్‌, ప్లస్‌ టూ విద్యార్థులను పబ్లిక్‌ పరీక్షలకు సన్నద్ధం చేసేలా రివిజన్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇదివరకే ప్రకటించామని తెలిపింది. ఆ ప్రకారం, టెన్త్‌ విద్యార్థులకు జనవరి 19 నుంచి 27వ తేదీ వరకు, ప్లస్‌ టూ విద్యార్థులకు జనవరి 19 నుంచి 28వ తేదీ వరకు రివిజన్‌ పరీక్షలు జరుగనున్నాయి. అలాగే, మార్చి 21 నుంచి 26వ తేదీ వరకు టెన్త్‌, 21 నుంచి 29వ తేదీ వరకు ప్లస్‌ టూ విద్యార్థులకు రివిజన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో కుదించిన పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలుంటాయని పేర్కొన్న ప్రభుత్వ పరీక్షల విభాగం, రివిజన్‌ పరీక్షలకు సంబంధించిన టైంటేబుల్‌ను విడుదల చేసింది.

Updated Date - 2021-12-29T13:57:59+05:30 IST