ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-06-28T06:47:26+05:30 IST
ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, ఖీమ్యానాయక్ ఆదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, జూన్ 27: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, ఖీమ్యానాయక్ ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 33 ఫిర్యాదులు, వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులు అర్జీలను క్షుణంగా పరిశీలించి భాధితులకు న్యాయం చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజావాణిలో భూసమస్యల పరిష్కారం కోరుతూ ఎక్కువగా అర్జీలు వస్తున్నందున రెవెన్యూ ఫిర్యాదులు, వినతులపై వెంటనే స్పందించాలన్నారు. ఆర్డీవోలు శ్రీనివాసరావు, లీల పాల్గొన్నారు.
రోడ్లను నిర్మించాలి
సిరిసిల్ల అర్బన్ పరిధిలో నిర్మిస్తున్న రెండో బైపాస్ రోడ్డును ఆనుకొని ఉన్న గ్రామాలకు రహదారులను నిర్మించాలని అదనపు కలెక్టర్ సత్యప్రసాద్కు 9వ వార్డు కౌన్సిలర్ లింగంపల్లి సత్యనారాయణ వినతి పత్రం అందించారు. 9వ వార్డు పరిధిలోని పెద్దూర్ శివారులోని తుర్కాకాశీపల్లె, మాలపల్లె, దూప్యానాయక్ తండా, బాబాజీ కాలనీల నుంచి బైపాస్ రోడ్డు వరకు ఉన్న పాత రోడ్లను మూసివేసి కొత్తగా రోడ్లను నిర్మించకపోవడంతో బైపాస్ రోడ్డు అటువైపున పోలాలతోపాటు గుట్టలో బండలను కొట్టేందుకు పోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెద్దూర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు జెట్టి దేవయ్య, 9వ వార్డు టీఆర్ఎస్ అధ్యక్షుడు షేక్ అలీ ఉన్నారు.