పీటీడీ బస్సులకు పెరుగుతున్న ఆదరణ
ABN , First Publish Date - 2020-11-01T02:37:44+05:30 IST
ప్రజా రవాణా శాఖ(పీటీడీ) విశాఖపట్నం రీజియన్ ఆదాయం రోజురోజుకూ పెరుగుతున్నది.
రూ.65 లక్షలకు చేరిన రోజువారీ ఆదాయం
రూరల్ డివిజన్లో 75 శాతం ఓఆర్
ద్వారకాబస్స్టేషన్: ప్రజా రవాణా శాఖ(పీటీడీ) విశాఖపట్నం రీజియన్ ఆదాయం రోజురోజుకూ పెరుగుతున్నది. కొవిడ్-19 నేపథ్యంలో సుమారు ఆరు నెలలు బస్సులు నిలిచిపోయాయి. తిరిగి సెప్టెంబరు 19న బస్సులు పునః ప్రారంభం రోజున జిల్లాలో 112 బస్సులు ఆపరేట్ చేస్తే 25 శాతం ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) నమోదై రూ.6 లక్షలు ఆదాయం వచ్చింది. తరువాత క్రమేణా ఆదాయం పెరుగుతూ వచ్చింది. అక్టోబరు 31 నాటికి రీజియన్లో 650 బస్సులు నడుపుతున్నారు. వీటిలో రూరల్ డివిజన్లో 240 బస్సులు 75 శాతం ఓఆర్తో, అర్బన్ పరిధిలో 410 బస్సులు 50 శాతం ఓఆర్తో రవాణా సేవలందిస్తున్నాయి. వీటివల్ల రీజియన్కు రోజువారీ ఆదాయం రూ.65 లక్షలుగా నమోదవుతున్నది. కాగా, లాక్డౌన్కు ముందు రీజియన్లో 1064 బస్సుల ద్వారా రోజువారీ ఆదాయం సుమారు రూ.1.10 కోట్లు ఉండేది. ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతున్న దృష్ట్యా బస్సుల సంఖ్యను పెంచాలని పీటీడీ అధికారులు ఆలోచిస్తున్నారు.