పోరుకు సై!
ABN , First Publish Date - 2022-08-09T09:41:33+05:30 IST
రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు తెరలేచింది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి రాజీనామాతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమయింది.
మునుగోడు ఉప ఎన్నిక అక్టోబరులో!
యుద్ధానికి సిద్ధమవుతున్న ప్రధాన పార్టీలు
ముందే కార్యాచరణ ప్రారంభించిన టీఆర్ఎస్
చండూరులో సభ నిర్వహించిన కాంగ్రెస్
బండి సంజయ్ పాదయాత్రతో బీజేపీ ప్రవేశం
హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు తెరలేచింది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి రాజీనామాతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమయింది. దీంతో ప్రధాన పార్టీలన్నీ సై అంటే సై అంటున్నాయి. అన్ని పార్టీలూ ఎన్నికల కసరత్తు మొదలుపెట్టాయి. రాజీనామా ఆమోదం కంటే ముందే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. తామే ముందున్నామనే సంకేతాలిచ్చేందుకు పరస్పరం పోటీ పడుతున్నాయి. సోమవారం రాజగోపాల్రెడ్డి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి.. రాజీనామాను సమర్పించడం, మరుక్షణమే రాజీనామాను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ కార్యాలయం ప్రకటించడంతో ఎన్నికల వేడి ఒక్కసారిగా రాజుకుంది. దీంతో పార్టీలన్నీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వ్యూహప్రతివ్యుహాల్లో బిజీ అయ్యాయి. దీంతో మునుగోడు ఉప ఎన్నిక అంశం ఒక్కసారిగా రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించేలా మారింది. వాస్తవానికి అధికార టీఆర్ఎస్ మునుగోడు ఉప ఎన్నికను ముందే ఊహించింది. అందుకు తగ్గట్లుగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. చకచకా ఆ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గట్టు మండలాన్ని ప్రకటించింది. అభివృద్ధికి సంబంధించి పలు జీవోలు జారీ చేసింది. నిధులను యుద్ధప్రాతిపదికన విడుదల చేసింది. శనివారం మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ కొత్త పెన్షన్లు గురించి మాట్లాడటం.. ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునేనన్న అభిప్రాయం ఉంది. దీంతోపాటు ఉమ్మడి నల్లగొండ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో మొదటివారంలోనే జీతాలు చెల్లించారు. మరోవైపు మునుగోడులో పెన్షన్లు, దళితబంధు నిధులను ఎక్కువగా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్య నేతలను తమ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలను అధికార పార్టీ మమ్మురం చేసింది. రాజగోపాల్రెడ్డి రాజీనామాను ఆమోదించడం ఆలస్యం చేస్తే ఉప ఎన్నికకు భయపడ్డామన్న అభిప్రాయం వస్తుందనే వెంటనే ఆమోదించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
పోటీ పోటీ వ్యూహాలు..
మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమని కాంగ్రెస్ కూడా ముందే అభిప్రాయానికి వచ్చింది. గత కొద్ది రోజులుగా రాజగోపాల్రెడ్డి తీరును అనుమానిస్తూనే ఉంది. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తారని అంచనా వేసింది. అందుకే వెంటనే అప్రమత్తమై.. మధుయాష్కీగౌడ్ కన్వీనర్గా వ్యుహకమిటీని వేసింది. రాజగోపాలరెడ్డి రాజీనామాను అధికారికంగా ప్రకటించగానే సీఎల్పీ సమావేశమయింది. ఉప ఎన్నికకు సంబంధించి నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కూడా ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే ఆ నియోజకవర్గంలోని చండూరులో బహిరంగ సభను నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లోనూ ఆయనవిస్తృతంగా పర్యటించనున్నారు. ఇదిలా ఉంటే.. మునుగోడు ఉప ఎన్నికకు ఒక రకంగా సూత్రధారి బీజేపీయే. ఒక వ్యుహం ప్రకారం దక్షిణ తెలంగాణలో పాగా వేసేందుకే మునుగోడును బీజేపీ కార్యక్షేత్రంగా చేసుకుంది. రాజగోపాల్రెడ్డి రాజీనామా, అది ఆమోదించే నాటికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండిసంజయ్ యాత్ర మునుగోడుకు చేరుకునేలా ప్లాన్ చేశారు. సోమవారం ఆ నియోజవర్గ పరిధిలోని చౌటుప్పల్లో సభ నిర్వహించారు. అమిత్ షా నుంచి బండి సంజయ్ వరకు ఇప్పుడు అందరూ దృష్టి మునుగోడుపైనే కేంద్రీకరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ కాషాయ జెండా రెపరెపలాడించేందుకు అవసరమైన అన్ని హంగులతో కమలదళం రంగంలోకి దిగింది.