తొలి వాణిజ్య విజయం
ABN , First Publish Date - 2021-03-01T07:06:21+05:30 IST
ఇస్రో విజయాశ్వం గురి తప్పలేదు. లాక్డౌన్ అనంతరం, ఈ ఏడాది ఇస్రో తలపెట్టిన ‘తొలి’ వాణిజ్య ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. 14 విదేశీ, 5 స్వదేశీ ఉపగ్రహాలను మోసుకుంటూ నింగిలోకి...
- గురితప్పని పీఎస్ఎల్వీ-సీ51 రాకెట్
- ఎన్ఎస్ఐఎల్ తొలి ప్రయోగం విజయవంతం
- 14 విదేశీ, 5 స్వదేశీ ఉపగ్రహాలు రోదసీలోకి
- 17 నిమిషాల్లోనే కక్ష్యలోకి అమెజోనియా-1
- మరో గంటన్నరలో మిగిలిన 18 ఉపగ్రహాలు
- అంతరిక్షంలోకి మోదీ ఫొటో, భగవద్గీత
శ్రీహరికోట (సూళ్లూరుపేట), ఫిబ్రవరి 28: ఇస్రో విజయాశ్వం గురి తప్పలేదు. లాక్డౌన్ అనంతరం, ఈ ఏడాది ఇస్రో తలపెట్టిన ‘తొలి’ వాణిజ్య ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. 14 విదేశీ, 5 స్వదేశీ ఉపగ్రహాలను మోసుకుంటూ నింగిలోకి ఎగిరిన పీఎ్సఎల్వీ-సీ51 అలవోకగా లక్ష్యాన్ని పూర్తిచేసి ఇస్రోకి మరో ఘన విజయాన్ని కట్టబెట్టింది. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీ్షధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఆదివారం ఉదయం 10:24 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ రోదసిలోకి దూసుకెళ్లిన పీఎ్సఎల్వీ-సీ51 గంటా 55 నిమిషాల్లోనే 19 ఉపగ్రహాలను అంచలంచెలుగా నిర్ణీత కక్ష్యల్లో విడిచిపెట్టింది. తొలి 17.24 నిమిషాల్లోనే సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలో బ్రెజిల్కు చెందిన అమెజోనియా-1ను విడిచిపెట్టింది. తదుపరి రాకెట్లోని నాల్గవ దశ ఇంజన్ను ఆఫ్ఆన్ చేస్తూ శాస్త్రవేత్తలు రాకెట్ను రోదసిలో 1:33 గంటలు పయనింపచేశారు. అనంతరం డీఆర్డీవో ఆధ్వర్యంలో బెంగళూరు పీఈఎస్ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన సింధునేత్ర ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అనంతరం స్పేస్కిడ్జి ఇండియా విద్యార్థులు రూపొందించిన సతీశ్ ధవన్శాట్, అమెరికాకు చెందిన ఎస్ఎఐ-1 నానో కనెక్టివిటీ-2 ఉపగ్రహం, ఆ దేశానికే చెందిన 12 స్పేస్బీస్ ఉపగ్రహాలు వరుసగా రాకెట్ నుంచి విడివడి కక్ష్యల్లోకి చేరుకున్నాయి. చివరగా స్వదేశీ విద్యార్థులు రూపొందించిన జేఐటీశాట్, జీహెచ్ఆర్సీఈశాట్, శ్రీశక్తిశాట్లతో కూడిన యూనిటీశాట్ కక్ష్యలోకి చేరుకుంది. దాంతో ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ ప్రకటించారు.
ఎన్ఎ్సఐఎల్ తొలి వాణిజ్య ప్రయోగం
గతంలో భారత అంతరిక్షశాఖ ఆధ్వర్యంలో యాంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ విదేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకొని ఆయా దేశాల ఉపగ్రహాలను ఇస్రో రాకెట్ల ద్వారా కక్ష్యల్లోకి చేరవేయించేది. అయితే ప్రస్తుతం ప్రధాని మోదీ నూతనంగా న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎ్సఐఎల్)ను రూపొందించి విదేశాలతోపాటు భారత్లోనూ ప్రైవేట్ సంస్థలను అంతరిక్ష ప్రయోగాలలో భాగస్వాములు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు పీఎ్సఎల్వీ-సీ51 రాకెట్తో ఇస్రో ఎన్ఎ్సఐఎల్ తొలి వాణిజ్య ప్రయోగాన్ని నిర్వహించింది.
భగవద్గీత, మోదీ ఫొటో!
స్పేస్ కిడ్జ్ ఇండియా విద్యార్థుల ఉపగ్రహం ద్వారా భగవద్గీత కాపీలు, మోదీ ఫొటో, పేరుతో పాటు ఇస్రో చైర్మన్ శివన్, ఆత్మనిర్భర భారత్ వంటి 25వేల పేర్లను రోదసిలోకి పంపారు.
ఈ ఏడాది ఇస్రో బిజీ: శివన్
ఇస్రోకు ఈ ఏడాది చేతినిండా పని ఉందని ఇస్రో చీఫ్ శివన్ అన్నారు. ప్రయోగ విజయానంతరం షార్లోని మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచిఆయన ప్రసంగించారు. ఈ ఏడాది ఏడు ప్రయోగాలు నిర్వహించాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు. 6 రాకెట్లతో ఉపగ్రహాలు, గగన్యాన్ రిహార్సల్స్లో భాగంగా ఈ ఏడాది చివర్లో ఒక మానవరహిత రాకెట్ను ప్రయోగిస్తామన్నారు. బెంగళూరుకు చెందిన పిక్సెల్ ఇండియా రూపొందించిన ‘ఆనంద్’ అనే ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించి ఉంటే తాజా ప్రయోగం పరిపూర్ణమయ్యేదని శివన్ అన్నారు. కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆ సంస్థ ప్రయోగానికి ముందు వైదొలిగిందని ఆయన చెప్పారు.
‘సింధునేత్ర’ విజయానికి అభినందనలు: పీఈఎస్ చాన్సలర్
బెంగళూరు: బెంగళూరు పీఈఎస్ యూనివర్సిటీ విద్యార్థులు మూడేళ్లపాటు శ్రమించి రూపొందించిన ‘సింధునేత్ర’ ఉపగ్రహం పీఎ్సఎల్వీ సీ-51 ద్వారా అంతరిక్షంలోకి చేరింది. ఈ ఉపగ్రహం సముద్రతీరంపై నిఘా వేయనుంది. ఈ ఘనత సాధించిన తమ సిబ్బందికి వర్సిటీ చాన్స్లర్ ప్రొఫెసర్ ఎంఆర్ దొరస్వామి అభినందనలు తెలిపారు.
అంతరిక్ష సంస్కరణల్లో కొత్త శకం: మోదీ
ఇస్రో చేపట్టిన తొలి వాణిజ్య ప్రయోగం పీఎ్సఎల్వీ-సీ51 విజయం పట్ల ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అభినందనలు తెలిపారు. ‘దేశంలో అంతరిక్ష సంస్కరణల్లో కొత్తశకానికి ఇది నాంది పలికింది. పీఎ్సఎల్వీ-సీ51 ద్వారా బ్రెజిల్కు చెందిన అమెజోనియా-1 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపి తొలి వాణిజ్య ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో, న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎ్సఐఎల్)కు అభినందనలు’ అని మోదీ ట్వీట్ చేశారు. ఇస్రో చేపట్టిన పీఎ్సఎల్వీ-సీ51 విజయవంతం కావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇస్రో టీమ్కు అభినందనలు చెప్పిన ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ ఇది అంతరిక్ష పరిశోధన, అన్వేషణలో భారత్ చేస్తున్న కృషికి నిదర్శనమని కొనియాడారు.
భారత్తో బంధం బలోపేతం: బ్రెజిల్ మంత్రి
భారత్తో బ్రెజిల్ సంబంధం మరింత బలోపేతమవుతుందని ఆ దేశ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి మార్కస్ పోంటెస్ అన్నారు. బ్రెజిల్ ఉపగ్రహం అమెజోనియా-1ను ప్రయోగిస్తున్న సందర్భంగా ఆయన ఆదివారం షార్ నుంచి ప్రయోగాన్ని వీక్షించారు. అనంతరం ఇస్రోకు కృతజ్ఞతలు తెలిపారు. తమ దేశానికి చెందిన మరిన్ని ఉపగ్రహాలను కక్ష్యల్లోకి చేరవేయించుకుంటామని వెల్లడించారు.
ఇస్రోతో దేశఖ్యాతి పెరుగుతోంది: ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్: ఇస్రోతో దేశ ఖ్యాతి పెరుగుతోందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. పీఎ్సఎల్వీ-సీ51 ప్రయోగం అనంతరం ఇస్రోకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి అంతరిక్ష పరిశోధన సంస్థల్లో ఇస్రో ఒకటని మళ్లీ నిరూపితమైందని పేర్కొన్నారు. పలు దేశాలు తమ అవసరాల కోసం ఇస్రోను ఎంచుకోవడం భారతదేశానికి గర్వకారణమని అన్నారు.