‘అభివృద్ధి మండలి’ సమావేశానికి పటిష్ఠ భద్రత కల్పించండి

ABN , First Publish Date - 2021-02-25T07:57:37+05:30 IST

తిరుపతిలో వచ్చేనెల నాల్గవ తేదీ జరగనున్న దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశానికి పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర అదనపు డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా ఆదేశించారు.

‘అభివృద్ధి మండలి’ సమావేశానికి పటిష్ఠ భద్రత కల్పించండి
సమావేశంలో ప్రసంగిస్తున్న హరీష్‌కుమార్‌ గుప్తా

అదనపు డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా

తిరుపతి(నేరవిభాగం), ఫిబ్రవరి 24: తిరుపతిలో వచ్చేనెల నాల్గవ తేదీ జరగనున్న దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశానికి పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర అదనపు డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా  ఆదేశించారు. ఏర్పాట్ల పరిశీలన నిమిత్తం బుధవారం తిరుపతికొచ్చిన ఆయన స్థానిక పోలీసు అతిథి భవనంలో ఇంటెలిజెన్స్‌ ఐజీ శశిధర్‌రెడ్డి, అనంతపురం రేంజ్‌ డీఐజీ క్రాంతి రాణాటాటా, అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌ గిరీష్‌ తదితర అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా హరీష్‌కుమార్‌ గుప్తా మాట్లాడుతూ.. సమావేశానికి హోంమంత్రి అమిత్‌షాతోపాటు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని చెప్పారు. విమానాశ్రయం నుంచి నుంచి సమావేశ వేదిక అయిన తాజ్‌ హోటల్‌ వరకు క్షణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. హోటల్‌ లోపల, వెలుపల సీసీ కెమెరాలను పెట్టి, నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. బందోబస్తు నిర్వహించే అధికారులు, సిబ్బంది అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలన్నారు. అనంతరం అధికారులతో కలిసి తాజ్‌ హోటల్‌ను, పరిసరాలను తనిఖీ చేశారు. 

Updated Date - 2021-02-25T07:57:37+05:30 IST