మార్కెట్ ధరలకు అనుగుణంగా పరిహారం ఇప్పించండి
ABN , First Publish Date - 2022-08-11T05:44:04+05:30 IST
బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలకు అనుగుణంగా నష్టపరిహారం ఇవ్వాలని కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి భూనిర్వాసితులు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ను కోరారు.
కరీంనగర్ టౌన్, ఆగస్టు 10: బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలకు అనుగుణంగా నష్టపరిహారం ఇవ్వాలని కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి భూనిర్వాసితులు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ను కోరారు. ఈ మేరకు చెంజర్ల, ఖాదర్గూడెం ఎన్హెచ్-563 భూ నిర్వాసితులు బుధవారం కరీంనగర్లో వినోద్కుమార్ నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. మానకొండూర్ మండలంలోని చెంజర్ల, ఖాదర్గూడెం రెవెన్యూ గ్రామ పరిధిలోని ఇళ్లు, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములు, బావులు, వ్యాపారాలు కోల్పోతున్న వారి భూములకు గుంటకు 63 వేల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తామనడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణలో పోతున్న ఇళ్ల స్థలాలు బహిరంగ మార్కెట్లో గుంటకు 8 నుంచి 10 లక్షల వరకు, వ్యవసాయ భూములు గుంటకు 4 నుంచి 6 లక్షల వరకు ధర పలుకుతున్నాయని, వీటికి అనుగుణంగా పరిహారం ఇప్పించాలని కోరారు.