ఘనంగా బాలికల దినోత్సవం
ABN , First Publish Date - 2022-01-25T05:12:49+05:30 IST
ఆడ పిల్లలను స్వేచ్ఛగా బతకనివ్వాలని ట్రైనీ ఐపీఎస్ అధికారి ధీరజ్ తెలిపారు.
కర్నూలు, జనవరి 24: ఆడ పిల్లలను స్వేచ్ఛగా బతకనివ్వాలని ట్రైనీ ఐపీఎస్ అధికారి ధీరజ్ తెలిపారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో దిశా పోలీస్స్టేషన్ డీఎస్పీ వెంకట్రామయ్య ఆధ్వర్యంలో బాలికల సంరక్షణ హక్కులు, చట్టాలకు సంబంధించి పోస్టర్ను విడుదల చేశారు. అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా, మండల స్థాయిలో బాల్య వివాహాలను అరికట్టడం, బాలికల హక్కులను వివరించడం, వివిధ శాఖల సమన్వయంతో బాలికలను రక్షించే కార్యక్రమాన్ని చేపడుతామని తెలిపారు. బాలల పరిరక్షణ విభాగం డీసీపీవో శారద, పద్మ, శ్రీలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు(లీగల్): జాతీయ బాలికల దినోత్సవ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయ సమీపంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.వి.రాధాకృష్ణ కృపాసాగర్ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.పద్మ ఈ న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. వసతి గృహంలో ఉండే బాలికలకు ప్రభుత్వం అందించే సదుపాయాలను గురించి తెలుసుకుని సామాజిక దూరం, పరిశుభ్రత గురించి వసతి గృహ సంరక్షురాలిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు కె.ప్రవీణ, శారద, శ్రీలక్ష్మి, శైలజ, సులోచన తదితరులు ఉన్నారు.
కర్నూలు(న్యూసిటీ): బాలికలు చదువులో రాణించి ఆదర్శప్రాయంగా నిలవాలని హౌసింగ్ జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య అన్నారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక నర్సింగ్ హస్టల్లో జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో క్రాప్ అడ్వొకేస్ ఫౌండేషన్ సహకారంతో సోమవారం జాతీయ బాలిక దినోత్సవ పోస్టరును విడుదల చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జేసీ మౌర్య మాట్లాడుతూ బాలికలు చదువుకుని ప్రయోజకులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వినోదిని, రైట్స్ ఫోరం ప్రెసిడెంట్ కే. విజయరాజు, ఏపీ ప్రో చైల్డ్ రీజనల్ కన్వీనర్ బత్తుల చిన్నయ్య, మాజీ సీడబ్ల్యూసీ సభ్యులు మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.
బాలికలు స్వేచ్ఛగా సురక్షితమైన వాతావరణంలో ఎదిగే అవకాశాన్ని కల్పించాలని కర్నూలు అడ్వైజరీ కమిటీ సభ్యుడు, లయన్స్ క్లబ్ చైర్మన్ రాయపాటి శ్రీనివాస్ అన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని వెంకటరమణ కాలనీలోని నైస్ కంప్యూటర్స్, లయన్స్క్లబ్ ఆఫ్ కర్నూలు మెల్విన్ జోన్స్, నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పోస్టరును విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేవీఆర్ కళాశాల ఓజేటి విద్యార్థులు, లక్ష్మీ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షురాలు రాయపాటి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు (కల్చరల్): నగరంలోని 49వ వార్డు రోజా వీధిలో ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇంటికి దీపం ఆడపిల్లలే అంటూ కొవ్వొత్తులు వెలిగించి అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఐక్యవేదిక నగర అధ్యక్షురాలు మీసాల సుమలత, సభ్యులు ఆర్పీ మెహమూదా, రామలక్ష్మి, చిట్టెమ్మ, నాగమ్మ, మద్దమ్మ బాలబాలికలు పాలొన్నారు.